అల్వార్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు
అత్యాచారం చేసి.. వీడియో చిత్రీకరణ
బాధితులకే వీడియోను పంపిన వైనం
అల్వార్: భర్తతో కలిసి పెళ్లి షాపింగుకు వెళ్తుండగా.. ఐదుగురు వ్యక్తులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఇంకా 20 ఏళ్లు కూడా నిండని ఆ యువతి ఇప్పటికీ ఆ బాధను మర్చిపోలేకపోతోంది. రాత్రిపూట నిద్రపోవడం కూడా కనాకష్టం అవుతోంది. రాజస్థాన్ లోని అల్వార్ లో గ్యాంగ్ రేప్ బారిన పడిన దళిత యువతి దుస్థితి ఇది. తనకు ఏం జరిగిందో తెలుసుకుంటే కనీసం మంచం మీద నుంచి లేవలేకపోతున్నానని, అదంతా పదే పదే తన కళ్ల ముందు కదులుతోందని.. కానీ బలవంతంగా మళ్లీ మామూలు అయ్యేందుకు ప్రయత్నిస్తున్నానని బాధిత యువతి ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’ పత్రికకు తెలిపింది. కానీ మళ్లీ నిద్రపోయేందుకు అలా నడుం వాల్చగానే మళ్లీ తన కళ్లముందు ఆడుతుందని, దాంతో నిద్రపట్టడం లేదని వాపోయింది. ఆ దుర్మార్గులకు ఉరిశిక్ష పడాల్సిందేనని, అది కేవలం తనపై జరిగిన అత్యాచారానికి కాదని.. మరే ఆడదానికీ ఇలాంటి బాధ కలగకుండా ఉండటానికేనని చెప్పింది.
ఏప్రిల్ 26వ తేదీన బాధితురాలి అత్తవారింట్లో పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పెళ్లికి కోడలికి మంచి బట్టలు కొనిపెట్టమని తన కొడుకును స్వయంగా ఆమె మామగారు పురమాయించారు. తన మేనల్లుడి పెళ్లి జరుగుతోందని, కోడలు 2016 డిసెంబరులో తమ ఇంటికి వచ్చాక అదే పెద్ద పండగని, ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు కొనుక్కుంటుండటంతో తన కొడుక్కి తానే ఆమెను తీసుకెళ్లమని చెప్పానని ఆయన అన్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాళ్లిద్దరూ బైకు మీద బయల్దేరారు. దారిలో ఆరుగురు నిందితులు రెండు బైకులపై వెళ్తూ వారిని ఆపారు. తమ వెనకాలే వస్తుంటే ముందు ఏమీ అనుకోలేదని, కానీ ఉన్నట్టుండి ముందుకు వచ్చి బండి అడ్డంగా పెట్టారని ఆమె చెప్పింది. తొలుత తమ పేర్లు, తండ్రి పేర్లు అడిగారని, తర్వాత కులం అడిగారని.. తాము దళితులమని చెబితే, ‘దళితులైతే మమ్మల్నేం చేస్తారు’ అని వాళ్లు ప్రశ్నించారంది. ఆ తర్వాత పెళ్లి అయిందా అని అడిగారు. తామిద్దరం భార్యాభర్తలమేనని చెపపినా, తమను పక్కనే ఉన్న ఇసుక దిబ్బల్లోకి లాగేశారని చెప్పింది. అక్కడ ఐదుగురు నిందితులు తనపై లైంగిక దాడి చేశారని, ఆరో వ్యక్తి అదంతా వీడియో తీశాడని తెలిపింది. వాళ్లంతా అయిపోయిన తర్వాత తన భర్తతో బలవంతంగా శృంగారం చేయించి అది కూడా వీడియో తీశారని చెప్పింది.
సాయంత్రం 5 గంటలకు తమను వదిలిపెట్టారని, తన భర్త వద్ద ఉన్న రూ. 2వేలు లాక్కుని, ఘటన గురించి ఎవరికైనా చెబితే వీడియోలు విడుదల చేస్తామని బెదిరించారని చెప్పింది. తర్వాత తాను అత్తవారింటికి బదులు పుట్టింటికి వెళ్లి, ఏం జరిగిందో చెప్పానంది. తన తల్లి తన భర్తను పిలిచి మాట్లాడిందని, వాళ్ల దగ్గర వీడియోలు ఉన్నాయి కాబట్టి ఎవరికీ చెప్పద్దని సలహా ఇచ్చిందని తెలిపింది. తర్వాత అత్తవారింటికి వెళ్లి స్నానం చేసి దుస్తులు ఉతుక్కున్నానంది. ఏప్రిల్ 28న నిందితులు ఆ దంపతులకు ఫోన్ చేసి, రూ. 10వేలు ఇవ్వకపోతే వీడియోలు బయటపెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. దాంతో ఆమె తన మరిదికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. దాంతో అతడు తన ఫోను నుంచి వాళ్లకు ఫోన్ చేసి ఏం కావాలన్నా తననే అడగాలి తప్ప అన్నకు ఫోన్ చేయద్దన్నాడు. తొలుత వారికి డబ్బులిచ్చి అప్పుడే వీడియోలు డిలీట్ చేయిద్దామనుకున్నానని, కానీ తన సహోద్యోగులు పోలీసులకు చెప్పమని సలహా ఇవ్వడంతో వారికి తెలిపానని అన్నాడు. ఏప్రిల్ 29న బాధితురాలి అత్తమామలకు కూడా విషయం చెప్పి, 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ రెండు రోజుల పాటు పోలీసులు స్పందించలేదన్నారు.
మే 2న ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని, వారికి నిందితుల గురించి చెప్పి, వాళ్లెవరో గుర్తించామని.. అయినా పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదని బాధితురాలి మరిది చెప్పారు. మే 4వ తేదీన తన ఫోనుకు ఆ వీడియోలు వచ్చాయని అన్నారు. తొలుత వాళ్లు పంపి ఉంటారనుకోలేదని, కానీ వీడియో చూసిన తర్వాత.. అతడే పంపాడని అర్థమైందని తెలిపారు. తన అన్న, వదినలకు ఏం జరిగిందో అందులో ఉందని, ఆ వీడియోలను తాను పోలీసులకు చూపించానని.. కానీ మే 7వ తేదీన మొట్టమొదటి అరెస్టు చూపించారని అన్నారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన వెంటనే వాళ్లు స్పందిస్తే వీడియోలు బయటకు వచ్చేవే కావని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రస్తుతం పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టుచేశారు. జాతీయ మానవహక్కుల సంఘం రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. దాంతో అల్వార్ ఎస్పీని తొలగించి, స్థానిక పోలీసు స్టేషన్ ఇన్ చార్జిని సస్పెండ్ చేశారు. బీజేపీ, దళిత సంఘాలు ఈ కేసులో తక్షణ చర్యలు తీసుకోవాలంటూ నిరసనలు తెలుపుతున్నాయి. ఈ అత్యాచారం ఎన్నికల్లో ప్రచారాంశంగా మారిపోయింది. మే 6వ తేదీన అక్కడ ఎన్నికలు ముగిసేవరకు అల్వార్ కేసులో చర్యలేమీ తీసుకోలేదని స్వయంగా ప్రధాని మోదీ ఆరోపించారు.