న్యూ ఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అనంతరం ప్రతిపక్షాలు మళ్లీ ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలపైనే దృష్టి సారించాయి. ఇవిఎంల విశ్వసనీయతను గట్టిగా ప్రశ్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఈ విషయమై ఎన్నికల కమిషన్ను కలవనున్నారు.
వివిప్యాట్ స్లిప్పుల లెక్కతో ఇవిఎం కౌంటింగి సరిపోలని పక్షంలో నియోజకవర్గంలోని మొత్తం కేంద్రాలలో వివిప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ఆయన కోరుతున్నారు. ఈరోజు ఆయన ఇదే డిమాండ్ను కమిషన్ ముందు ఉంచబోతున్నారు. కమిషన్ కార్యాలయం ముందు మిగతా ప్రతిపక్షాలతో కలిసి ధర్నా చేసే ఆలోచన కూడా ఉంది.
చంద్రబాబు ఢిల్లీలో 22 ప్రతిపక్షాల నాయకులతో కూడా సమావేశం కానున్నారు. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న అంచనాలను విశ్వసించని ప్రతిపక్షాలు గురువారం ఎన్నికల ఫలితాలు వెలువడేనాటికి తమదైన వ్యూహంతో సిద్ధంగా ఉండాలని భావిస్తున్నాయి.
మరోపక్క ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలయింది. ముందు వివిప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందిగా ఎన్నికల కమిషన్ను ఆదేశిచాలని కోరుతూ యలమంజుల బాలాజీ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. సెలవు కాలపు న్యాయమూర్తులు జస్టిస్ జి.శ్యాంప్రసాద్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిల ధర్మాసనం ఈరోజు మధ్యాహ్నం ఈ పిటిషన్పై విచారణ జరపనుంది. లెక్కలో తేడా వస్తే మొత్తం కేంద్రాలలో వివిప్యట్ స్లిప్పులు లెక్కించాలని కూడా పిటిషన్లో కోరారు.