ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా వెల్లడి
న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ ఉల్లంఘలనపై ఎంతకూ స్పందించరేమని సుప్రీంకోర్టు గట్టిగా మొట్టికాయలు వేసిన తర్వాతే తాను జోక్యం చేసుకున్నానని ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా అన్నారు. ఈ విషయమై ఆయన ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన నాయకులపై తీసుకున్న చర్యలేంటని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఏప్రిల్ 15న అడిగింది. అదే రోజు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సమాజ్ వాదీ నేత ఆజం ఖాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి మేనకా గాంధీలపై ఈసీ సస్పెన్షన్ విధించింది. 3 రోజుల తర్వాత.. కోడ్ ఫిర్యాదుల విషయంలో అవలంబించే చర్యలను బలోపేతం చేయడానికి ఒక నోట్ సిద్ధం చేశారు. మే 16న ఆయన కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన సమావేశాలలో ఇక పాల్గొనబోనని చెప్పారు. తాను చేసిన సూచనలపై స్పందించకపోవడం, తన మైనారిటీ నిర్ణయాలను కమిషన్ తుది ఉత్తర్వులలో అసలు ప్రస్తావించకపోవడంతో నిరసనగా ఈ చర్యకు దిగారు. ‘‘ఎన్నికల సంఘం నిర్ణయాలు మెజారిటీ ఆధారంగా తీసుకున్నప్పుడు మైనారిటీ అభిప్రాయాన్ని రికార్డు చేయకపోతే, ఇక వేరే అభిప్రాయం ఉండి ఉపయోగం ఏంటి’’ అని ఆయన ప్రశ్నించారు. పలువురు సభ్యులుండే చట్టబద్ధమైన సంస్థల పనితీరుకు ఒక పద్ధతి ఉందని, ఎన్నికల సంఘం కూడా దాన్ని అమలుచేయాలని అన్నారు.
కోడ్ ఉల్లంఘన భేటీలకు హాజరు కాకూడదని ఎందుకు నిర్ణయించుకున్నారని అడగ్గా లావాసా ఇలా స్పందించారు. ‘‘ఏప్రిల్ 18వ తేదీ నుంచే వివాదం మొదలైంది, దాదాపు నెల రోజుల పాటు అది కొనసాగిన తర్వాత నేను మే 16న నా నిర్ణయం చెప్పాను. కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులతో ఎలా వ్యవహరించాలన్న పద్ధతిని బలోపేతం చేయడం, క్రమబద్ధం చేయడమే నా ప్రాథమిక ఉద్దేశం. అన్ని ప్రక్రియలు పారదర్శకంగా, సమయానుగుణంగా ఉండాలని అనుకున్నాను. తీవ్రమైన ఉల్లంఘనలకు పరిణామాలు ఎలా ఉండాలో చెప్పాను. నా సూచన కచ్చితంగా అమలుచేయాలని చెప్పను గానీ, కనీసం దానిపై కమిషనులో చర్చ అయితే జరగాలి. ఎట్టకేలకు మే 2న ఒక సమావేశం జరిగింది. అందులో ఈ విషయమై తమ అభిప్రాయాలను ఒక ఫైలులో రికార్డు చేయాలని నిర్ణయించాం. మే 4న నేను రికార్డు చేశాను. మే 10, 14 తేదీలలో ఇతరులు కూడా అలా చేయాలని గుర్తుచేసినా, వాళ్లు స్పందించకపోవడంతో ఇక కోడ్ ఉల్లంఘన సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నా’’ అని ఆయన చెప్పారు.
మైనారిటీ అభిప్రాయం కూడా చాలా ముఖ్యమైనదని లావాసా తెలిపారు. నిర్ణయం ఏకాభిప్రాయం కానప్పుడు మెజారిటీ అభిప్రాయమే చెల్లుబాటు అవుతుందని, దాంతో ఇదొక వలయంలా తిరుగుతూనే ఉంటుందని అన్నారు. ఈసీలో విభేదాల వల్ల రాజకీయ నాయకులు దాని నిబద్ధతను ప్రశ్నించరా అని అడిగితే.. తనకు దాంతో సంబంధం లేదని చెప్పారు. ఇవన్నీ విధానపరమైన మార్పులని, అవి మొత్తం సంఘంలో అమలుకావాలని అన్నారు. పారదర్శకమైన, కాలావధిలో జరిగే విధానాన్ని తాను ఇష్టపడతానని తెలిపారు.