(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఒక దేశం ఒకే ఎన్నిక అన్న ఎజెండాపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నిర్వహిస్తున్న సమావేశం కనీసం కొన్ని రాజకీయ పక్షాలను ఇబ్బందిలోకి నెట్టింది. మోదీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరు కారాదని నిర్ణయించుకున్నారు.
ఆయా రాజకీయ పార్టీల అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరు కావాలని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొన్నది. తృణమూల్ కాంగ్రెస్ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకోగా, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డైలమాలో పడ్డారు. ఎన్నికలకు ముందు ఎన్డిఎతో తెగతెంపులు చేసుకున్ననాటినుంచీ మోదీని తీవ్రంగా వ్యతిరేకించి, ప్రతిపక్ష ఐక్యతా ప్రయత్నాలకు కేంద్ర బిందువుగా మారిన చంద్రబాబు రాష్ట్రంలో ఘోర పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఈ సమావేశానికి వెళ్లేందుకు ఆయనకు ముఖం చెల్లకపోవడాన్ని అర్ధం చేసుకోవచ్చు.
మరోపక్క 55 సీట్లతో లోక్సభలో అతి పెద్ద ప్రతిపక్షంగా అవతరించిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు లేడు. సాంకేతికంగా రాహుల్ గాంధీ ఇప్పటికీ ఆ పార్టీ అధ్యక్షుడే అయినప్పటికీ ఎన్నికలలో పరాజయానికి నైతిక బాధ్యతగా నాయకత్వాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించిన దగ్గర నుంచీ ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి సమావేశానికి ఎవరు వెళతారన్నది ఆసక్తికరంగా మారింది.
లోక్సభకూ, వివిధ రాష్ట్రాల శాసనసభలకూ ఒకేసారి ఎన్నికలు జరపాలన్న బిజెపి ప్రతిపాదనను మెజారిటీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తికి ఇది విరుద్ధమని ఆ పార్టీలు వాదిస్తున్నాయి. ఇలాంటి సంక్లిష్టమైన విషయాన్ని హడావిడిగా చర్చించడం వల్ల ప్రయోజనం ఉండదనీ, ముందు దీనిపై ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే దాానిని పరిశీలించి అప్పుడు అభిప్రాయాలు చెప్పగలమనీ మమత లేఖ రాశారు. పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి ప్రహ్లాద్ జోషీకి ఆమె ఆ లేఖ పంపించారు.