న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శుక్రవారం సమావేశమై రాహుల్ గాంధీకి వారసుడిని ఎంపిక చేయనున్నది. 2019 ఎన్నికలలో పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ అఖిల భారత కాంగ్రెస్ ఆధ్యక్ష పదవికి మే నెలలో రాజీనామా చేసిన దగ్గర నుంచీ ఆ పదవి ఖాళీగానే ఉంది.
మాజీ మంత్రి ముకుల్ వాస్నిక్ ఆ పదవిని అధిష్టించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 59 ఏళ్ల ముకుల్ వాస్నిక్కు పార్టీ పాలనా వ్యవహారాల అనుభవం మెండుగా ఉంది. కనీసం మళ్లీ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు జరిగేంత వరకూ ఆయన పదవిలో ఉండవచ్చని అంటున్నారు.
సోనియా గాంధీ నివాసంలో ఈ రోజు పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఎకె ఆంటోనీ, కెవి వేణుగోపాల్, అహ్మద్ పటేల్ వంటి సీనియర్ నేతలు ఆ సమావేశంలో పాల్గొన్నారు. రాహుల్ తన నిర్ణయం మార్చుకునే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇంకా ఖాళీగా ఉంచడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఆ సమావేశంలో అభిప్రాయపడ్డారు.