కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై మండిపడ్డారు. తన ఫోన్ ట్యాపింగ్కు గురైందని మమత అనుమానం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని నెంబర్ల నుండి వాట్స్అప్ సందేశాలు వస్తున్నాయని మమత పేర్కొన్నారు. పిటిఐ వార్తా సంస్థతో ఈ విషయాలను వెల్లడించారు. జర్నలిస్ట్లు, మానవహక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టడానికి ఇజ్రాయేల్ స్పైవేర్ను ఉపయోగించాయనీ, ఇది చాలా తీవ్రమైనదిగా మమత పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపించాలని ప్రధాని మోదిని కోరుతున్నట్లు మమత తెలిపారు.
ఇలా ఫోన్లు ట్యాపింగ్కు గురవుతుంటే మాట్లాడే స్వేచ్చ ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు. ఫోన్లో కూడా మనం స్వేచ్చగా మాట్లడలేకపోతే ఇక మనకు ఏం స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మమత ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పటికే తన ఫోన్ను ఎన్నో సార్లు ట్యాప్ చేయించిందనీ, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయనీ మమత అన్నారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసునని మమత పేర్కొన్నారు. కేంద్రంతో పాటు మరో రెండు, మూడు రాష్ట్రాలు కూడా కలిసి ఈ పని చేశాయని మమత ఆరోపించారు. అయితే వాటి పేర్లు తాను వెల్లడించననీ, వాటిలో ఒక రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉందని మమత చెప్పారు.