హైదరాబాద్: వాహనదారులారా జర జాగ్రత్త. ఎందుకంటే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి నుంచే కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. జేబుకు చిల్లు పడటం ఖాయమే. రోడ్డు మీదకు వచ్చేటప్పుడు హెల్మెట్, లైసెన్స్, బండి పేపర్స్ అన్ని ఖచ్చితంగా ఉండాలి లేదంటే మీ జేబు ఖాళీ అవ్వక తప్పదు. రోడు ప్రమాదాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా 30 ఏండ్ల క్రితం నాటి మోటారు వాహనాల చట్టం 1989లో సవరణలు చేసి మోటారు వాహనాల(సవరణ) బిల్లు – 2019ను రూపొందించారు. ఇక ఈ బిల్లు ఆమోదంతో గతంలో ఉన్న జరిమానాలు ఎవరూ ఊహించనంత రీతిలో భారీగా పెరిగాయి. ఇప్పటికే పోలీసులు ఈ కొత్త రూల్స్ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు.
వాహనదారులు ఇకపై రోడ్డు మీద బండి నడపాలంటే ఖచ్చితమైన నిబంధనలు పాటించాల్సిందే. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా పోలీసులు భారీ జరిమానాలు విధిస్తారు. ఈ రూల్ను అతిక్రమిస్తే.. రూ.500 నుంచి రూ.10,000 వరకూ జరిమానా, ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. సీటు బెల్ట్ ధరించకపోతే.. రూ.1000 జరిమానా విధిస్తారు. మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులు, సంరక్షకులకు రూ.25 వేల జరిమానా, మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారు. డ్రంకెన్డ్రైవ్లో దొరికితే రూ.10 వేల జరిమానా ఉంటుంది. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినా.. భారీ ఫైన్ కట్టాల్సిందే. రోడ్లపై రేసింగులు చేసినా, లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా 5 వేలు వసూలు చేస్తారు. అధిక లోడ్తో వెళ్లే వాహనాలపై రూ.20 వేల జరిమానాతో పాటు ప్రతి అదనపు టన్నుకు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తారు. మరోవైపు ఇంత భారం మోపడం తగదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.