న్యూఢిల్లీ: కాలుష్యాన్ని నియంత్రించేందుకు దేశ రాజధాని ఢిల్లీలో సరి-బేసి సంఖ్య విధానాన్ని మళ్లీ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ 4వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సరి-బేసి సంఖ్య విధానాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడారు. దీపావళి పండుగ సందర్భంగా దేశ రాజధానితో పాటు పొరుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తారని, దీనివల్ల వెలువడే వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి సరి-బేసి వాహన రిజిస్ట్రేషన్ నంబర్ల విధానాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు.
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో 2016లో మొదటి సారిగా సరి-బేసి విధానాన్ని కేజ్రీవాల్ సర్కార్ ప్రయోగాత్మకంగా అమలుచేసింది. ఆ తర్వాత పలుసార్లు సరిబేసి విధానాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన సరి-బేసి విధానం మంచి ఫలితాలే ఇచ్చింది. ఇప్పుడు మరోసారి సరి బేసి విధానాన్ని తీసుకురాబోతున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.
Delhi Chief Minister Arvind Kejriwal: Odd-Even vehicle scheme to be implemented from 4th to 15th November, 2019. pic.twitter.com/qVmLChGHsd
— ANI (@ANI) September 13, 2019
రాజధాని ఢిల్లీలోనే కాలుష్యం ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే చాలా సర్వేలు వెల్లడించాయి. చుట్టుపక్క రాష్ట్రాల్లోని పంట పొలాల్లో వ్యర్ధాల దహనం, భారీ పరిశ్రమలు వదులుతున్న రసాయన కారక వాయువులు, పౌరుల వ్యక్తిగత వాహనాలే వాయు కాలుష్యానికి ప్రధాన కారణం. అయితే డీజిల్, పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఆధారిత వాహనాలను వినియోగిస్తే వాయు కాలుష్యం కొంత తగ్గునుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఇందుకోసం ఢిల్లీలో వెయ్యి విద్యుత్ బస్సులను ప్రవేశపెడతామని ఆయన ప్రకటించారు.
సాధారణంగా నవంబర్ లో న్యూఢిల్లీలో తోడు దట్టమైన మంచు అలముకుంటుంది. వాహన కాలుష్యం తోడు కావడం, అదే నెలలో దీపావళి పండుగ రావడం.. ఇవన్నీ న్యూఢిల్లీని వాయు కాలుష్య కాసారంగా మార్చేస్తుంటాయి. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమయ్యేంతటి పరిస్థితులు అక్కడ ఉత్పన్నమౌతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాహనాల రాకపోకలను అదుపు చేయాలని నిర్ణయించినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. వాహన సంచారాన్ని నియంత్రించడం వల్ల కొంతమేరకైనా వాయు కాలుష్యాన్ని అదుపు చేయడానికి వీలుంటుందని కేజ్రీవాల్ తెలిపారు.