అమరావతి: కృష్ణనది కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివసిస్తున్న భవనం కూలగొట్టే విషయంలో ప్రభుత్వానికి న్యాయస్థానం నుంచి అవరోధం ఎదురయింది. స్వయంగా కూలగొట్టుకోకపోతే ప్రభుత్వమే కూలగొట్టాల్సివస్తుందని హెచ్చరిస్తూ సిఆర్డిఎ ఇచ్చిన నోటీసు గడువు గురువారంతో ముగుస్తున్నది. దీనిపై ఆ భవనం యజమాని లింగమనేని రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో రమేష్కు తాత్కాలికంగా ఊరట లభిచింది.
మళ్లీ వాయిదా రోజు వరకూ భవనాన్ని కూలగొట్టబోమని సిఆర్డిఎ తరపున హాజరయిన అడ్వొకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ కోర్టుకు హామీ ఇచ్చారు. జస్టిస్ కె. విజయలక్ష్మి ముందు బుధవారం ఈ రిట్ పిటిషన్ విచారణకు వచ్చింది. లింగమనేని రమేష్ తరపు తెలంగాణ మాజీ అడ్వొకోట్ జనరల్ డి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు.
నదీగర్భం నుంచి వంద మీటర్ల లోపు భవనం నిర్మించారనడానికి ఆధారం ఏమిటని న్యాయమూర్తి సిఆర్డిఎను ప్రశ్నించారు. దానికి ఆధారంగా అడ్వొకేట్ జనరల్ కొన్ని ఫొటోలు చూపించారు. ఫారెస్టు డిపార్ట్మెంట్ చేసిన సర్వే నివేదిక, లేక అటువంటి శాస్త్రీయమైన ఆధారాలు చూపాలని న్యాయమూర్తి కోరారు. దానికి అడ్వొకేట్ జనరల్ సమయం అడగడంతో న్యాయమూర్తి విచారణను 30 వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకూ యధాతధ స్థితి కొనసాగిస్తామని అడ్వొకేట్ జనరల్ న్యాయమూర్తికి హామీ ఇవ్వడంతో ఆమె ఆ విషయంలో ఉత్తర్వు ఇవ్వకుండా కేసు విచారణ వాయిదా వేశారు.