న్యూఢిల్లీ: తన పేరు అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలోంచి తీసేయాలని హఫీజ్ సయీద్ చేసిన విజ్ఞప్తి పీటీఐకి ఎలా తెలిసిందని పాకిస్థాన్ అడిగింది. ఆ విజ్ఞప్తిని ఐక్యరాజ్యసమితి తిరస్కరించిన విషయం భారత వార్తా సంస్థకు తెలియడంతో పాకిస్థాన్ కుతకుతలాడిపోతోంది. అందువల్ల పీటీఐకి ఈ సమాచారం ఎలా తెలిసిందో కనుక్కోడానికి ఒక విచారణ కమిటీని నియమించాలని కోరింది. ఐక్యరాజ్యసమితిలో జరిగే విషయలపై ప్రచురితమైన కథనాల మీద విచారణ జరపాలని ఒక దేశం కోరడం చాలా అరుదు. పాక్ ఇప్పుడిలా చేసింది.
భారత అధికారిక వార్తా సంస్థ అయిన పీటీఐకి కమిటీలోని 15 మంది సభ్యులలో ఎవరు సమాచారం లీక్ చేశారో కనుక్కోవాలని ఐరాసలో పాక్ రాయబారి మలీహా లోదీ కోరారు. ఈ మేరకు ఆయన గత వారం ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. పీటీఐని ఆమె భారత అధికారిక వార్తాసంస్థ అని తప్పుగా పేర్కొన్నారు. కానీ, మాజీ పాత్రికేయురాలైన లోదీ.. పీటీఐ కథనాలు ప్రచురితమైన వార్తాపత్రికల క్లిప్పింగులను మాత్రం తన ఫిర్యాదుకు జతచేశారు.
2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి అయిన హఫీజ్ సయీద్.. తన పేరును నిషేధిత ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించాలని చేసిన విజ్ఞప్తిని ఐక్యరాజ్య సమితి తిరస్కరించింది. ఈ విషయాన్ని మార్చి 7న పీటీఐ తన కథనంలో పేర్కొంది. భారతదేశం అత్యంత రహస్య సమాచారం సహా వివరమైన సాక్ష్యాలు ఇవ్వడంతో ఐక్యరాజ్యసమితి ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, తన ఫిర్యాదులో లోదీ ఎక్కడా పీటీఐ కథనం తప్పని మాత్రం పేర్కొనకపోవడం విశేషం. కానీ నిషేధం కొనసాగించాలన్న సమాచారం ఎలా వచ్చిందని మాత్రమే ఆమె ప్రశ్నించారు. ఇలాంటి సమాచారాన్ని భవిష్యత్తులో బయటకు వెళ్లనివ్వకుండా చూడాలని కోరారు. అయితే, లోదీ విజ్ఞప్తికి ఐక్యరాజ్య సమితి ఏమాత్రం స్పందించినట్లు ఇంతవరకు కనిపించలేదు.