(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
మాస్కులు వేసుకుని రోడ్లుపై ఉంటున్న పోలీసులు ఏం పాపం చేశారు..? ముక్కు మూసుకుని పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఏం పాపం చేశారు…? ఏం నిర్మలమ్మ…,ఏం మోడీ గారూ వీరికెందుకు ప్యాకేజి ఇవ్వలనిపించలేదు…? మీరిచ్చిన 1.70 లక్షల కోట్లలో వీరిది కలిపేస్తే మహా అయితే 2 లక్షల కోట్లు అవుతుంది… ఇదేమైనా మీకు ఎక్కువా? ఇదేమైనా మీకు ఆర్ధిక నష్టమా???
కర్ఫ్యూ విధుల్లో పోలీస్ సిబ్బంది సేవలు
సాధారణ సమయంలో కంటే ప్రస్తుత కర్ఫ్యూ పరిస్థితిలో పోలీస్ సిబ్బంది అందిస్తున్న సేవలు కష్టతరం. ఉదయం 6గంటల నుండి రాత్రి 9గంటల వరకు ఒక షిఫ్ట్, రాత్రి 9గంటల నుండి ఉదయం 6గంటల వరకు మరొక షిఫ్ట్ విధులను నిర్వహిస్తున్నారు. అసలే వేసవి కాలం, మరోపక్క కరోనా వైరస్ భయం వెంటాడుతున్నా రోజు కు 15గంటలు పోలీస్ లు విధులను నిర్వహిస్తున్నారు. అయితే ఓ పక్క వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కి ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించిన కేంద్ర ప్రభుత్వం పోలీస్ వర్గాలకు ఎటువంటి రాయితీలు ప్రకటించకపోడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కర్ఫ్యూలో పారిశుధ్య సిబ్బంది సేవలు
కరోనా వైరస్ ఎవరికి ఉందొ తెలియదు. ఎవరి ద్వారా ఎలా వస్తుందో తెలియదు. కానీ పారిశుధ్య సిబ్బంది ఇంటి ఇంటికి వెళ్లి చెత్త సేకరించి తరలించడం పారిశుధ్య సిబ్బందికి ఇబ్బంది కరంగా మారింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 53వేలకు పైగా పారిశుధ్య కార్మికులు ఉండగా దేశ వ్యాపితంగా సుమారు 14లక్షల మంది ఉన్నట్లు అంచనా. ఈ క్లిష్ట పరిస్థితిలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు వైరస్ సోకకుండా రక్షణ పరికరాలు పూర్తి స్థాయిలో అందజేయలేదు.అరకొరగా అందజేసిన గ్లోజ్ లతోనే వారు విధులను నిర్వహిస్తున్నారు. పబ్లిక్ రవాణా నిలిపి వేయడం తో పట్టణ ప్రాంతాల్లో వారి నివాసాల నుండి విధులకు హాజరు కావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు వైద్యులు, నర్సులకు అందజేస్తున్న విధంగా సేఫ్టీ గౌన్ లు ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. అదే విధంగా విధులు నిర్వహిస్తున్న ప్రదేశాలలో భోజనం, వసతి సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. పాలకులు వీరి సేవలను గుర్తించాల్సిన అవసరం ఉన్నది.