పోలవరం, జనవరి 7: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రెండు గిన్నిస్ రికార్డులను సాధించింది. ఈ ప్రాజెక్టులో 24 గంటల్లో 32, 315.5 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోసి ఒక రికార్డు, 24 గంటల్లో గతంలో సాధించిన 21, 580 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను 16 గంటల్లోనే అధిగమించి మరో రికార్డు కైవసం చేసుకుంది.
సోమవారం పోలవరం ప్రాజెక్టు వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గిన్నిస్ సంస్ధ ప్రతినిధిులు రికార్డు ధృవీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ పోలవరంతో రికార్డులు బ్రేక్ చేశామని అన్నారు. భారత దేశంలో అనేక ప్రాజెక్టులు కట్టారు కానీ ఒక్క పోలవరంలోనే రికార్డులు సాధించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ రికార్డు సాధించడం పట్ల అధికారులను, నవయుగ ఎండి శ్రీధర్ను అయన అభినందించారు. రానున్న మార్చిలో ఒకే రోజు 65 వేల క్యూబిక్ మీటర్లు లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.
కేంద్రం నిధులు ఇవ్వకపోయినా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగదని ఆయన చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వాలంటూ ప్రజలే వత్తిడి తేవాలని ఆయన కోరారు. చారిత్రాత్మక ప్రాజెక్టు అడ్డుపడవద్దని కేంద్రానికి సిఎం విజ్ఞప్తి చేశారు . 2019 జూన్కల్లా గ్రావిటీతో పోలవరం ద్వారా నీటిని అందిస్తామని ఆయన తెలిపారు.
next post