ముంబాయి: కాంగ్రెస్కి రాజీమానా చేసిన జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది శుక్రవారం మధ్యాహ్నం శివసేన పార్టీలో చేరారు. గురువారం రాత్రి తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాజీనామా లేఖ విడుదల చేసిన ప్రియాంక చతుర్వేది మధ్యాహ్నం శివసేన అదినేత ఉద్దవ్ థాకరేను కలిశారు.
సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ పార్టీలో అంచలంచలుగా ఎదిగి జాతీయ అధికార ప్రతినిధి హోదాకు ఎదిగిన ప్రియాంక చదుర్వేది కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. రాజీనామా చేసిన 24గంటల వ్యవధిలోనే బిజెపికి మిత్రపక్షమైన శివసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముంబాయిలో పుట్టి పెరిగిన ప్రియాంక చతుర్వేది పదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐలో చేరారు. అనంతరం పార్టీలో పలు పదవులు నిర్వహించారు.
కొద్ది రోజుల క్రితం మధురలో మీడియా సమావేశంలో కొందరు స్థానిక కాంగ్రెస్ నేతలు అమె పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించగా ఆమె ఫిర్యాదుపై పార్టీ వారిని సస్పెండ్ చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా వారిపై సస్పెన్సన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రియాంక చతుర్వేది తీవ్ర ఆగ్రహం చెంది పార్టీకి రాజీనామా చేశారు.