ఢిల్లీ: దేశంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా మేనిఫెస్టోను రూపొందించామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో హమ్ నిభాయేంగే పేరుతో పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రాహుల్ గాంధీ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాదిగా మేనిఫెస్టో రూపకల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశామని తెలిపారు. దీన్ని గదిలో కూర్చుని రూపొందించలేదని, ప్రజల మనసులో ఆలోచన ప్రతిబింబించేలా రూపకల్పన చేశామని చెప్పారు.
దేశంలో 2030 నాటికి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ముఖ్యంగా ఐదు అంశాలపై దృష్టి సారించామని వివరించారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, రణ్దీప్ సుర్జేవాలా తదితరులు పాల్గొన్నారు.
మేనిఫెస్టోలోని ఐదు ముఖ్యాంశాలు:
1. న్యాయ్ పథకం ద్వారా ఏడాదికి 72 వేల రూపాయలు పేదలకు అందిస్తాం.
2. ప్రస్తుతం ఖాళీ ఉన్న 22 లక్షల పోస్టులను భర్తీ చేస్తాం. పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాలను పూరిస్తాం. కొత్తగా వ్యాపారం చేసుకునేవారికి తొలి మూడేళ్ల పాటు ఎలాంటి అనుమతులూ అవసరం లేకుండా చేస్తాం. గ్రామీణ ఉపాధి హామీని పటిష్ఠం చేస్తాం. ఇప్పుడున్న పని దినాలను 100 నుంచి 150కి పెంచుతాం.
3. రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ను తీసుకొస్తాం. రుణాలు చెల్లించలేని రైతులపై పెట్టే కేసులను క్రిమినల్ కేసులుగా పరిగణించం.
4. బడ్జెట్లో విద్యారంగానికి ఆరు శాతం నిధులు కేటాయిస్తాం.
5. జాతీయ, అంతర్గత భద్రతకు పెద్దపీట వేస్తాం.
అదేవిధంగా పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని రాహుల్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తామని, వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి నిధుల్ని పెంచుతామని రాహుల్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు.