అమరావతి: జనసేన పార్టీకి చెందిన ఒకే ఒక జనసైనికుడు అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాల్లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆ పార్టీ నుండి రాజోలు ఎస్సి రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ 1167 ఓట్ల ఆధిక్యతతో వైసిపి అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై విజయం సాధించగా, టిడిపి నుండి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మూడవ స్థానంలో నిలిచారు.
రేపాక వరప్రసాద్ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పిఆర్పి అభ్యర్థి నల్లి వెంకట కృష్ణమాలిక్పై 5,869ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. నాడు కూడా టిడిపి అభ్యర్థి బత్తుల రాము మూడవ స్థానానికే పరిమితం అయ్యారు.
నేటి ఎన్నికలలో వైసిపి నుండి గట్టి పోటీ ఎదురైనప్పటికీ కౌంటింగ్ తొలి రౌండ్ నుండి ఆధిక్యంలో కొనసాగారు.
జనసేన ఆవిర్భావం తరువాత రాపాక కాంగ్రెస్ పార్టీకి రాజీమానా చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. మొదటి జాబితాలోనే రాపాకకు పార్టీ అధిష్టానం అభ్యర్థిత్వం ఖరారు చేసింది. శాసనసభ్యుడుగా అనుభవం ఉన్న నాయకుడే జనసేన తరుపున ఒకే ఒక్కడుగా అసెంబ్లీకి అడుగుపెట్టబోతున్నారు.