శ్రీనగర్: తీవ్రమైన ఆంక్షల మధ్య కశ్మీర్లో బక్రీద్ జరుపుకుంటున్నారు. శనివారం ఆంక్షలు సడలించిన సందర్భంగా శ్రీనగర్లో అక్కడక్కడా అల్లర్లు చోటు చేసుకోవడంతో మళ్లీ నిర్బంధం ఆమలులోకి వచ్చింది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ పూర్తిగా బందయ్యాయి. అధికారికంగా కర్ఫ్యూ అమలులో లేకపోయినా పరిస్థితి దానికి ఏమాత్రం తీసిపోవడం లేదు.
బక్రీద్ సందర్భంగా రాజధాని నగరంలో జమా మసీదు సహా ఏ పెద్ద మసీదులోనూ ప్రార్ధనలకు అవకాశం లేకుండా పోయింది. ప్రజలు తమతమ నివాసాలకు దగ్గరలో ఉన్న చిన్న చిన్న మసీదులకు పరిమితమయ్యారు. ఆ ప్రార్ధనల తాలూకూ ఫొటోలను కూడా ప్రభుత్వమే మీడియాకు అందించింది.
ప్రభుత్వం అరెస్టు చేసిన రాజకీయ పార్టీల నాయకులను స్థానికంగా ఉన్న మసీదుల్లో బక్రీద్ ప్రార్ధనలకు తీసుకువెళ్లారు. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా అందరూ అరెస్టుల కిందే ఉన్నారు. పారూఖ్ అబ్దుల్లాను శ్రీనగర్, గుప్కార్ రోడ్లోని మసీదుకు తీసుకువెళ్లతున్నట్లు ఒక అధికారి తెలిపారు.
శనివారం ఆంక్షలను పాక్షికంగా సడలించినపుడు గొడవలు జరగడంతో అధికారులు మళ్లీ ఆంక్షలు విధించారు. ఈ లోపు మరుసటి రోజు బక్రీద్ను దృష్టిలో ఉంచుకుని ఆదివారం ఉదయం ప్రజలు పెద్ద ఎత్తున సరకుల కోనుగోలు కోసం వీధిల్లోకి వచ్చారు. కాస్సేపటికి పోలీసులు జీపుల్లో వీధుల్లో తిరుగుతూ యువకులను ఇళ్లకు తిరిగివెళ్లాల్సిందిగా మైకుల్లో హెచ్చరికలు జారీ చేశారు.
శనివారం భారీ స్తాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయన్న వార్తలను అధికారవర్గాల వారు ఖండించారు. అక్కడక్కడా ప్రదర్శనలు జరిగాయనీ, అయితే ఎక్కడా కూడా 20 మందికి మించి పోగు కాలేదనీ హోంశాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. పది వేల మంది నిరసనకారులతో ఒక ప్రదర్శన జరిగనట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు