మధ్యప్రదేశ్ మాజీ డిజిపి రిషి కుమార్ శుక్లా సిబిఐ నూతన డైరక్టర్గా ఎంపిక అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ శనివారం ఆయనను ఎంపిక చేసింది. 30 మంది ఐపిఎస్ అధికారుల జాబితా నుంచి శుక్లా పేరును ఖరారు చేశారు. ఈ కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, లోకసభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గె సభ్యులుగా ఉన్నారు.
శుక్లా రెండేళ్ల పాటు ఆ పదవిలో ఉంటారని కేంద్రప్రభుత్వం ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అలోక్ వర్మను కేంద్రం అర్ధరాత్రి పూట అకస్మాత్తుగా సాగనంపిన దగ్గర నుంచీ ఆ పదవి ఖాళీగా ఉంది. వర్మ, స్పెషల్ డైరక్టర్ రాకేష్ ఆస్థానా మధ్య తలెత్తిన వివాదం కారణంగా సిబిఐ పరువు బజారున పడింది.
కేంద్రం తనను బయటకు పంపడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసిన వర్మ తనకు అనుకూలంగా తీర్పు రాగానే మళ్లీ పదవిని అధిష్టించారు. అయితే ప్రధాని హైపవర్ కమిటీని వెంటనే సమావేశపరిచి ఆయనను మళ్లీ బదిలీ చేశారు. ఈ మధ్య కాలంలో ఎం. నాగేశ్వరరావును తాత్కాలిక డైరక్టర్గా నియమించారు. ఆ నియామకాన్నిసవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణలో ఉంది.