హైదరాబాద్: సిద్దులగుట్ట రోడ్డులో అయ్యప్ప ఆలయ సమీపంలో మృతి చెందిన మహిళ వివరాలను పోలీసులు కనుగొన్నారు. ఆమె మృతికి ఆత్మహత్య కారణంగా పోలీసుల ప్రాధమిక విచారణలో తెలిసింది.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య కేసు శంషాబాద్ పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా అదే ప్రాంతంలో మరో మహిళ మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాత్రి సమాచారం రావడంతోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సగం కాలిన గాయాలతో మృతి చెందిన 35 ఏళ్ల మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
ప్రియాంక రెడ్డి తరహాలోనే ఈ మహిళను దుండగులు అత్యాచారం గావించి హత్య చేశారా అనుమానాలు వెల్లువెత్తాయి.
మృతురాలు అప్పర్ ధూల్పేటలోని బాబా బోలక్దాస్ నగర్కు చెందిన సంతోష్ సింగ్ భార్య కవితా బాయ్గా గుర్తించినట్లు శంషాబాద్ డిసిపి తెలిపారు. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతోందనీ, మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటి నుండి తనే స్వయంగా బయటకు వచ్చిందనీ, ఆమెది ఆత్మహత్యగా భావిస్తున్నామని ఆయన తెలిపారు.