కర్నాటక విధానసభలో కుమారస్వామి ప్రభుత్వం గురువారం విశ్వాసపరీక్ష ఎదుర్కొంటున్నది
న్యూఢిల్లీ: కర్నాటక సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం వెలువరించింది. తిరుగుబాటు శాసనసభ్యుల రాజీనామాలపై నిర్ణయం తీసుకునే విషయాన్ని పూర్తిగా స్పీకర్కే వదిలిపెడుతున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది.
అయితే శాసనసభకు హాజరు కావాల్సిందిగా తిరుగుబాటు శాసనసభ్యులు బలవంతపెట్టలేమని కోర్టు పేర్కొన్నది. కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన విప్ ఈ నిర్ణయం ఫలితంగా తిరుగుబాటు శాసనసభ్యులకు వర్తించదు. కుమారస్వామి ప్రభుత్వం కర్నాటక శాసనసభలో గురువారం విశ్వాసపరీక్షను ఎదుర్కొంటున్నది. శాసనసభ్యులు అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టత కారణంగా కుమారస్వామి నాయకత్వంలోని కాంగ్రెస్ – జెడిఎస్ సంక్రీర్ణ ప్రభుత్వం ఇబ్బంది పడక తప్పని పరిస్థితి కనబడుతోంది.
స్పీకర్కున్న విచక్షణాధికారాలకు సంకెళ్లు వేయలేమని ధర్మాసనం పేర్కొన్నది. శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ అధికారాల విషయంలో రాజ్యాంగం నిర్దేశిస్తున్న సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది. అన్ని విషయాలనూ పరిశీలించి స్పీకర్ తనకున్న అధికారాలను వినియోగించి రాజీనామాలపై నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నది. తను తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించాల్సిందిగా ధర్మసనం స్పీకర్ను కోరింది.
అయితే స్పీకర్ శాసనసభ్యులు రాజీనామాలను ఆమోదించకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు వారిని అనర్హులుగా ప్రకటిస్తే ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయానికి సంబంధించి కోర్టు ఆదేశాలలో స్పష్టత లేదు. నిజానికి స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించినా, రాజీనామాలను ఆమోదించినా కుమారస్వామి ప్రభుత్వానికి ఒనగూడేదేమీ లేదు. ఆయన ప్రభుత్వం మైనారీటిలో పడినట్లే లెఖ్క.
సుప్రీంకోర్టు తీర్పును బెంగళూరులో బిజెపి నాయకుడు యడ్యూరప్ప స్వాగతించారు. కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిందనీ, రేపు రాజీనామా చేయకతప్పదనీ ఆయన అన్నారు.