అమరావతి: సీట్ల కేటాయింపుపై అసెంబ్లీలో బుధవారం అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. టిడిపి సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కె అచ్చెన్నానాయుడు ఒకరి సీటులో మరొకరు కూర్చోవడంపై అధికారపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసిపి సభ్యుల అభ్యంతరంతో టిడిపి సభ్యులు ఎవరి సీట్లు వారు కూర్చోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు.
డిప్యూటి లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరారు. సభా సంప్రదాయాలను పాటించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రతి విషయాన్ని వివాదం చేయడం తగదని చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంలో నిబంధనల ప్రకారం అచ్చెన్నాయుడికి సీటు కేటాయించామని అధికార పక్షం పేర్కొన్నది. చంద్రబాబు విజ్ఞప్తిపై పరిశీలించి సీట్లు కేటాయిస్తామని స్పీకర్ తమ్మినేని వెల్లడించారు.
ఒక దశలో స్పీకర్ తమ్మినేని టిడిపి సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చెప్పినట్లు సభ నడపాలా? మీరు బెదిరించకండి అంటూ చంద్రబాబును ఉద్దేశించి తమ్మినేని గట్టిగా మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ ప్రతి విషయాన్ని టిడిపి రాద్ధాంతం చేసి సానుభూతి పొందాలని చూస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా టిడిపి పద్ధతి మార్చుకోవాలని జగన్ హితవు పలికారు.