చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోది, హోంశాఖ మంత్రి అమిత్షాలపై సూపర్ స్టార్, రజని మక్కల్ మంద్రమ్ పార్టీ అధినేత రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండేళ్ల ప్రస్థానంపై రూపొందించిన ‘లిజనింగ్..లెర్నింగ్..లీడింగ్’ పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఆవిష్కరించారు. చెన్నైలోని కలైవనర్ అరంగం వేదికగా ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్, తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, శాస్త్రవేత్త ఎంఎన్ స్వామినాధన్తో పాటు రజనీకాంత్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ మోది, షా ఇద్దరూ కృష్ణార్జనుల వంటివారని వ్యాఖ్యానించారు. మోది ఏదైనా చెబితే దాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా షా కృషి చేస్తారని రజనీ అన్నారు. కశ్మీర్ అంశం, ఆర్టికల్ 370 రద్దు అంశాలను ప్రస్తావిస్తూ తనకు ఎంతో సంతోషాన్ని కల్గించిందని అన్నారు. వారిద్దరూ కలిసి కశ్మీర్ను భారత్లో పూర్తిగా విలీనం చేయడంలో విజయవంతం అయ్యారని రజనీ కితాబు ఇచ్చారు. 370బిల్లుపై పార్లమెంట్లో అమిత్షా అద్భుతంగా ప్రసంగించారని రజనీ కొనియాడారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించిన రజనీకాంత్ ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వలేదు. చెన్నైలో నీటి సమస్య తీర్చేవారికి ఓటు వేయండని అభిమానులకు రజనీ సూచించారు.