న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ బిజెపి శాసనసభ్యుడు కులదీప్ సెనగర్ నుంచి తనకూ తన కుటుంబానికీ తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని ఉన్నావ్ అత్యాచారం బాధితురాలు సుప్రీంకోర్టుకు రాసిన లేఖపై గురువారం విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు.
రాయబరేలీ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో బాధితురాలు తీవ్రంగా గాయపడిన రెండు రోజులకు ఆమె జూలై 12న సుప్రీంకోర్టుకు లేఖ రాసిన విషయం బయటకు వచ్చింది. దానిపై ఒక నివేదిక రూపొందించి తనకు సమర్పించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి అధికారులను కోరారు.
పిల్లలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదయిన కేసులను సత్వరం విచారించాల్సిన అవసరం గురించి సీనియర్ న్యాయవాది వి. గిరి బుధవారం సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. అలాంటి కేసుల్లో ఒకదానిలో చాలా ఆందోళనకరమైన పరిణామాలు ఉన్నాయంటూ ఆయన ఉన్నావ్ కేసును ప్రస్తావించారు. దానికి జస్టిస్ రంజన్ గొగోయ్ స్పందిస్తూ, ఆ లేఖ గురించి తనకు నిన్న చెప్పారని తెలిపారు. ఈ విధ్వంసకర వాతావరణంలో ఏదన్నా చేసేందుకు ప్రయత్నిద్దాం అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.