అమరావతి: ఒక పక్క మద్యపాన నిషేదం విధిస్తామని చెబుతున్న ప్రభుత్వం మరో పక్క మద్యం ధరలను ఎందుకు పెంచాల్సి వచ్చిందని టిడిపి అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.
రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలనీని వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణలో ప్రభుత్వం మద్యం షాపుల నిర్వహిస్తున్నది. ఒకొక్క క్వార్టర్ బాటిల్కు అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఎఆర్ఇటి) పేరుతో 20 రూపాయల చొప్పున ధరలను పెంచి విక్రయాలు సాగిస్తున్నారు.
దీనిపై బుధవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి ‘జె ట్యాక్స్’ కోసమే మధ్యం ధరలు పెంచారని ఆరోపించారు. ‘మద్యం తయారు చేసే కంపెనీలు ఏమైనా లాస్లో నడుస్తున్నాయా, వారు వాడే నీళ్లు, మొలాసిస్ రేట్లు ఏమైనా పెరిగాయా, ఎందుకు ధరలను పెంచాల్సి వచ్చింది’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పరు. ఒకరిద్దరితో తనను తిట్టిస్తారు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పెద్దపెద్ద కంపెనీలకు పది శాతం ట్యాక్స్ రాయితీలు ఇవ్వడంలో తప్పులేదని చంద్రబాబు పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వం ధరలు పెంచి మద్యం కంపెనీలకు దోచిపెట్టి వారి నుండి కమీషన్లు పొందేందుకే ఈ ఎత్తుగడ అని చంద్రబాబు విమర్శించారు. చివరకు కాయకష్టం చేసుకొనే పేద వర్గాలను సైతం ప్రభుత్వం వదిలిపెట్టడం లేదనీ వారిని ఉతికేస్తున్నారనీ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లుగా చేస్తుంటే ఊరుకునేది లేదని చంద్రబాబు అన్నారు. ప్రజలకు అండగా నిలిచి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు.