హైదరాబాద్: హుజూర్ నగర్ ఉపఎన్నికలో అధికారపక్షమైన టిఆర్ఎస్ అభ్యర్ధిని బలపరచాలన్న సిపిఐ నిర్ణయం చాలామందికి మింగుడు పడడం లేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఏం చెప్పి సిపిఐని దారికి తెచ్చుకున్నారోనని రాజకీయవర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి. ఎమ్ఎల్సి సీటు ఒకటి కేటాయిస్తానని సిఎమ్ హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
ఎమ్ఎల్సి ఇస్తానన్నా, మరోటి ఇస్తానన్నా సిపిఐ లొంగాల్సింది కాదని వామపక్ష అభిమానులు అంటున్నారు. సిపిఐ నాయకులు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పన్నిన ఉచ్చులో చిక్కుకున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. హుజూర్ నగర్లో గెలవడం ప్రస్తుత పరిస్థితుల్లో కెసిఆర్కు చాలా ముఖ్యం. పరిస్థితి తమకు అనుకూలంగా లేనందువల్లే ఆయన సిపిఐ ముఖం చూశారనీ, లేకపోతే ఆమడ దూరంలో ఉంచేవారనీ అంటున్నారు. క్రితం అసెంబ్లీలో సిపిఐకి ఉన్న ఒక్క సభ్యుడినీ టిఆర్ఎస్లో చేర్చుకున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఆ చేదు అనుభవం అప్పుడే మరిచిపోతే ఎలా అని సిపిఐ కార్యకర్తలే అంటున్నారు.
అవిభక్త కమ్యునిస్టు పార్టీగా సిపిఐకి ఆంధ్రప్రదేశ్లో ఉజ్వలమైన చరిత్ర ఉంది. 1962 ఎన్నికలలో సిపిఐ ఏకంగా 51 సీట్లు గెలుచుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద మలుపు అయిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత చూస్తే 1985 ఎన్నికలలో 11 సీట్లు, 1994 ఎన్నికలలో 19 సీట్లు చేజిక్కించుకున్నది.
మధ్యలో 1999 మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సిపిఐ సభ్యులు లేకపోవడం అన్నది ఎప్పుడూ లేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో సిపిఐ ఒక్క సీటు సాధించగలిగింది. ఆ ఒక్క సభ్యుడినీ కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ లాగేసుకుంది. 2018 ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని మూడు సీట్లలో పోటీ చేసిన సిపిఐ ఘోర పరాజయం మూట కట్టుకున్నది. ఆ పార్టీకి 0.4 శాతం ఓట్లు వచ్చాయి. వేరే ఫ్రంట్లో భాగంగా పోటీ చేసిన సిపిఎమ్కు కూడా 0.4 శాతం ఓట్లే పోలయ్యాయి.
తొలుత నిజాం పాలనకూ, అనంతరం నెహ్రూ ప్రభుత్వానికీ వ్యతిరేకంగా తెలంగాణ సాయుధపోరాటం నడిపి యావత్ దేశం దృష్టినీ ఆకర్షించిన కమ్యునిస్టుల ఘనత ఆ విధంగా గతకీర్తికి పరిమితమై పోయింది.
2014 ఎన్నికల తర్వాత సిపిఐ టిఆర్ఎస్ పాలనను విమర్శిస్తూ వచ్చింది. అనంతరం 2018 ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. తర్వాత తెలంగాణలో రాజకీయంగా ఏం మార్పు వచ్చిందని సిపిఐ విధానం మార్చుకుందో చెప్పాలన్న ప్రశ్న వినబడుతోంది. ఇంతకాలం టిఆర్ఎస్ అవలంబించిన ప్రజావ్యతిరేక విధానాలు అకస్మాత్తుగా మంచివయిపోయాయా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి దివాలాకోరు విధానాల వల్లనే పెట్టని కోట వంటి తెలంగాణలో పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని వామపక్ష అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.