హైదరాబాద్: మోది నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఇటీవల తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటనకు సిద్ధపడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండవ సారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ప్రధాని మోదిని కెసిఆర్ ఇంత వరకూ కలవలేదు. శుక్రవారం ప్రధాన మంత్రి మోదిని కలిసేందుకు కెసిఆర్ గురువారం హస్తినకు బయలుదేరి వెళుతున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాదని కెసిఆర్ భావించిన విషయం తెలిసిందే. తృతీయ కూటమి ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాలని కెసిఆర్ ఆకాంక్షించారు. ఆ క్రమంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతు కూడగట్టే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆనాడు ఆయనకు అనుకూలంగా వైసిపి అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరు మాత్రమే వ్యవహరించారు. తృతీయ కూటమిని జగన్ స్వాగతించారు. అయితే ప్రత్యేక హోదా విషయంలో ఎవరు మద్దతు ఇస్తే వారికే కేంద్రంలో తాము సహకరిస్తామని జగన్ చివరి నిమిషంలో వెల్లడించారు. కెసిఆర్ ఊహలకు భిన్నంగా పార్లమెంట్లో భాగస్వామ్య పక్షాలతో సంబంధం లేకుండా మోది నేతృత్వంలోని బిజెపి 303 సీట్లు సాధించింది. అనంతరం
ప్రధాని మోది ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో కలిసి కెసిఆర్ ప్రత్యేక విమానంలో వెళ్లాలని భావించినా అక్కడ ప్రత్యేక విమానం దిగే పరిస్థితులు లేనందు వల్ల నాడు ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అనూహ్యంగా నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్న బిజెపి, టిఆర్ఎస్కు బలమైన ప్రత్యర్థిగా నిలిచేందుకు పావులు కదుపుతోంది. టిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని ఆ పార్టీ నాయకులు గట్టిగా చెబుతున్నారు. ఈ క్రమంలో కెసిఆర్ కేంద్రంలోని బిజెపిని విమర్శిస్తూ వస్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి కెసిఆర్ వెళ్లలేదు. ఆ తరువాత హోంమంత్రి ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సుకు కూడా కెసిఆర్ హజరు కాలేదు. తెలంగాణ తరుపున హోంశాఖ మంత్రి మహబూబ్ ఆలీని పంపించారు. చాలా రోజులుగా బిజెపికి దూరంగా ఉంటూ వచ్చిన కెసిఆర్ ఒక్క సారిగా ఢిల్లీ పర్యటన ఖరారు చేసుకోవడంతో ఏదో ముఖ్యమైన విషయమే ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, రాష్ట్ర విభజన అంశాలు, తదితర విషయాలపై ప్రధాని మోది, హోంమంత్రి అమిత్షాతో కలిసి చర్చించనున్నారని తెలుస్తోంది.