అమరావతి: టిడిపి చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమం పోలీసు నిర్బంధాలతో భగ్నం కాగా పలువురు టిడిపి నేతలు పోలీసులపై నోరు పారేసుకొని కొత్త వివాదంలో చిక్కుకున్నారు.
టిడిపి చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా పార్టీ నేతలు కేశినేని నాని, భూమా అఖిలప్రియ, దేవినేని ఉమామహేశ్వరావు, పత్తిపాటి పుల్లారావు, గద్దె రామ్మోహన్, సిద్దా రాఘవరావు, అయ్యన్నపాత్రుడు, వెలగపూడి రామకృష్ణబాబు, గోవిందు, తంగిరాల సౌమ్య తదితర నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్లను హౌస్ అరెస్టు చేశారు.
పోలీస్ చర్యలను నిరసిస్తూ మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితరులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. పోలీసులు వీరిని అడ్డుకునే క్రమంలో నన్నపనేని రాజకుమారి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ స్థానిక మహిళా ఎస్ఐ అనురాధ ఒక్క సారిగా భగ్గుమన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.
అదే విధంగా అచ్చెన్నాయుడును సైతం పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున లోపలకు వెళ్లనివ్వబోమని ఎస్పి విక్రాంత్ పటేల్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన అచ్చెన్నాయుడు ఏయ్ ఎగస్టా చేయొద్దు, నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ యూజ్లెస్ ఫెలో అని నోరు జారారు.
విజయవాడ నోవాటెల్ హోటల్ గది నుండి బయటకు రాకుండా మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ అధికారితో అఖిలప్రియ వాగ్వివాదానికి దిగారు.
కాగా అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనంకుల శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అచ్చెన్నాయుడుపై డిజిపికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తగిన బుద్ధి చెబుతామన్నారు. పోలీసులు యూజ్ లెస్ ఫెలోస్ కాదు, యూజ్ ఫుల్ పోలీసులు అన్న విషయాన్ని అచ్చెన్నాయుడు తెలుసుకోవాలన్నారు. పోలీసు అధికారులపై టిడిపి నేతలు వ్యవహరించిన తీరును వైసిపి నేతలు తప్పుబడుతున్నారు.