(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
పల్నాడు రణక్షేత్రంగా అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం ఢీకొన్నాయి. టిడిపి అధినేత పిలుపునిచ్చిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని భగ్నం చేయాలన్న వైసిపి ప్రభుత్వం పట్టుదల నెరవేరింది. ఎక్కడికక్కడ తెలుగుదేశం శ్రేణులను నిలువరించారు. గృహనిర్బంధంలో పెట్టారు. అరెస్టులు చేశారు. ఏకంగా చంద్రబాబునే ఇంటి బయటకు రానీయలేదు.
ఇది ఎవరి విజయం? చలో అత్మకూరు కార్యక్రమాన్ని భగ్నం చేసినందుకు వైసిపి ప్రతిపక్షంపై రాజకీయంగా పైచేయి సాధించిందనుకోవాలా? కార్యకర్తలను వెంట తీసుకుని ఆత్మకూరు వెళ్లలేకపోయినందుకు టిడిపి నాయకత్వం తాము విఫలమయినట్లు భావించాలా?
వైసిపి సంబరపడితే సంబరపడుతుండవచ్చు కానీ, చలో అత్మకూరు ద్వారా టిడిపి నేత చంద్రబాబు వైసిపిపై రాజకీయంగా పైచేయి సాధించారు. ఈ కార్యక్రమం ద్వారా జాతీయ మీడియా దృష్టిని ఆకట్టుకోగలిగారు. వంద రోజుల క్రితం వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకుముదరి టిడిపి ప్రభుత్వం కట్టించిన ప్రజావేదికను కూల్చివేశారు. చంద్రబాబు చట్ట వ్యతిరేకంగా కట్టడాలు నిర్మించారనీ, నది ఒడ్డున అక్రమంగా నిర్మించిన భవంతిలో తాను స్వయంగా ఉంటున్నారనీ ప్రభుత్వం చెప్పగలిగింది. అది అప్పట్లో సంచలనమే.
దాని తర్వాత విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్ష గానీ, పోలవరం కాంట్రాక్టుల రద్దు కానీ, రాజధానిగా అమరావతి కొనసాగింపును అనుమానంలో పడెయ్యడం కానీ జాతీయ మీడియా దృష్టిని అంతగా ఆకర్షించలేదు. ఇప్పుడు చంద్రబాబు విజయవంతంగా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించగలిగారు. ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతోందని అందరూ అనుకునేట్లు చేయగలిగారు.
జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తే చాలా అని ఎవరన్నా అనుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో చలో ఆత్మకూరు కార్యక్రమం ఎంత చర్చనీయాశమైందీ ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయమిచ్చి చూడాలన్న ధోరణిని వదులుకుని ఇంత త్వరగా రోడ్డెక్కడం సబబేనని ఎక్కువ శాతం ప్రజలు అనుకునేలా చంద్రబాబు చేయగలిగారు.
పల్నాడులో అధికారపక్షం ధాష్టీకానికి జడిసి ఊళ్లు వదిలి వెళ్లిన టిడిపి కార్యకర్తలకు అండగా నిలిచిన చంద్రబాబు వారి కోసం గుంటూరులో శిబిరం ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని రోజులకు వైసిపి స్పందించింది. నష్టం జరిగేట్లుందని గ్రహించి ఎదురుదాడికి దిగింది. గత అయిదేళ్ల టిడిపి పాలనలో పల్నాడు ప్రాంతంలో నష్టపోయిన వైసిపి కార్యకర్తలంటూ కొందరిని తెరపైకి తెచ్చారు. కానీ టిడిపి వ్యూహాన్ని మాత్రం దెబ్బ తీయలేకపోయారు.