అమరావతి: చలో ఆత్మకూరు విజయవంతం అయ్యిందని టిడిపి నేత కళా వెంకట్రావు అన్నారు. తమ ఆందోళన నేపథ్యంలో వైసిపి బాధితులను వారి స్వగ్రామాలకు పోలీసులు తరలించారనీ, ఇదే పని ముందుగా చేసుంటే బాగుండేదనీ వెంకట్రావు అన్నారు.
టిడిపి చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఎక్కడిక్కడ అరెస్టులు, గృహ నిర్భంధాలతో భగ్నం చేసిన పోలీసులు టిడిపి పునరావాస శిబిరంలో ఉన్న వైసిపి బాధితులను భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఐదు బస్సులలో వారి స్వగ్రామాలకు తరలించారు. వైసిపి బాధితులను పిడుగురాళ్ల, ఆత్మకూరు, మాచర్ల, గురజాల, దాచేపల్లికి పోలీసులు తరలించారు.
దీనిపై కళా వెంకట్రావు మాట్లాడుతూ టిడిపి చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమం విజయవంతం అయ్యిందన్నారు. ఇదే పని ముందు చేసి ఉంటే ప్రభుత్వంపై ఇంత ప్రతిఘటన వచ్చేది కాదని ఆయన అన్నారు. టిడిపి ఆందోళన కార్యక్రమంలో 5,224మంది పాల్గొన్నారని చెప్పారు. బాధితులకు భరోసా కల్పించామనీ, తమ కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని నింపామనీ వెంకట్రావు అన్నారు. 70మంది టిడిపి నేతలను గృహ నిర్బంధం చేశారనీ, 1,144మందికిపైగా తమ కార్యకర్తలను అరెస్టు చేశారని వెంకట్రావు తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పోలీస్ వ్యవస్థకు స్వేచ్చ ఇవ్వాలని ఆయన సూచించారు.