న్యూఢిల్లీ: యువతలో బాగా ప్రాచుర్యం పొందిన టిక్ టాక్ యాప్ ను గూగుల్ బ్లాక్ చేసింది. భారతదేశంలో ఇక ఎవరూ ఆ యాప్ ను వాడలేరు. దాని డౌన్ లోడ్లను నిషేధించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించడంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. తమ యాప్ మీద విధించిన నిషేధాన్ని సస్పెండ్ చేయాలని చైనాకు చెందిన బైటెడాన్స్ కంపెనీ చేసిన వినతిని హైకోర్టు తిరస్కరించింది. దాంతో ఇక ఆ యాప్ పరిస్థితి మార్కెట్లలో అనుమానంగానే మారిపోయింది. అది పోర్నోగ్రఫీని ప్రోత్సహిస్తోందని, పిల్లలను లైంగిక వేధింపుల బారిన పడేలా చేస్తోందని.. అందువల్ల వెంటనే టిక్ టాక్ ను నిషేధించాలని ఏప్రిల్ 3న కేంద్రాన్ని హైకోర్టు కోరింది.
ఈ యాప్ నిషేధం కోసం ఒక వ్యక్తి ప్రజాహిత వ్యాజ్యం వేయడంతో అది ఇక్కడివరకు వచ్చింది. హైకోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలంటూ యాపిల్, గూగుల్ రెండు సంస్థలకూ కేంద్రం లేఖలు పంపింది. ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లేస్టోర్ లో లేదు గానీ, యాపిల్ ప్లాట్ ఫారాల మీద మాత్రం ఇంకా ఉంది. చిన్న చిన్న వీడియోలు తీసి వాటికి స్పెషల్ ఎఫెక్టులతో పోస్ట్ చేసేందుకు టిక్ టాక్ యాప్ ఉపయోగపడుతుంది. ఇది భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. కానీ వీటిలో వచ్చే వీడియోలు అంత బాగోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. దేశంలో దాన్ని 24 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఒక్క జనవరి నెలలోనే 3 కోట్ల మంది దాన్ని తమ ఫోన్లలో ఇన్ స్టాల్ చేశారు.
మద్రాసు హైకోర్టు విధించిన నిషేధాన్ని బైటెడాన్స్ కంపెనీ సుప్రీంకోర్టులో సవాలుచేసింది. ఈ నిషేధం భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకమని వాదిస్తోంది. అయితే ఈ కేసును సుప్రీంకోర్టు మళ్లీ మద్రాసు హైకోర్టుకే పంపింది. అక్కడ బైటెడాన్స్ వినతిని న్యాయమూర్తి తిరస్కరించారు. ఈ కంపెనీకి భారతదేశంలో 250 మంది ఉద్యోగులున్నారు. త్వరలో విస్తరణకు కూడా యోచిస్తోంది. ఇంతలో నిషేధం వచ్చిపడింది.