(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆంధ్రప్రదేశ్లో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో సన్నిహిత సంబంధాలు కొనసాగించడంపై తెలంగాణలో విచిత్రమైన ప్రతిస్పందన వచ్చింది. టి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సన్నిహిత సంబంధాలు తెలంగాణ ప్రయోజనాలకు హానికరంగా కనబడ్డాయి. జగన్ చర్చలపై ఆయన నేడు మీడియా ముందు ఈ విధంగా వ్యాఖ్యానించారు.
కెసిఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా లేక ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
టిఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఆంధ్రప్రాంతంపై తీవ్రమైన విమర్శలు చేస్తూ ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ రాజేసి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ నేడు ఏపి సిఎం జగన్తో సుదీర్ఘ భేటీలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు పచ్చజెండా ఊపడంపై జీవన్ రెడ్డి మండిపడ్డారు.
సమైక్య వాదులతో చర్చలు అంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని జీవన్ రెడ్డి ఆరోపించారు. సమైక్యవాది, విభజనవాదుల సమావేశం ముచ్చటేస్తోందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన నీటిని ఆంధ్రాకు తరలిస్తామని కెసిఆర్ ఎలా అంటారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తాము గతంలో రాయలసీమకు నీళ్లిస్తామంటే ఆంధ్రోళ్లకు నీళ్లు దోపిడీ చేస్తున్నారని కెసిఆర్ నాడు విమర్శించారనీ, నీళ్ల తరలింపుకు ఇప్పుడెలా మద్దతు ఇస్తున్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రాణహిత నది పుట్టిన ఆదిలాబాద్ జిల్లాకు కెసిఆర్ ప్లాన్ ఏమిటో చెప్పాలని జీవన్ రెడ్డి కోరారు. ఎస్ఎల్బిసి టెన్నెల్ పనులు ఏమయ్యాయి, దీని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.