(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
గత 28 రోజులుగా లాక్ డౌన్ అమలుతో స్తంభించిన జనజీవనానికి సోమవారం నుండి కొంత ఉపశమనం లభించనుంది. దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి అమలు అవుతున్న లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం నుండి కొన్ని సడలింపులు ఇచ్చింది. లాక్ డౌన్ సడలింపులు రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్ లో వర్తించవు. లాక్ డౌన్ అమలు విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినా వాటిపై స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.
లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నేడు కీలక నిర్ణయాలు తీసుకున్నది. తెలంగాణలో మే ఏడవ తేదీ వరకు లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆహారం డోర్ డెలివెరీని కూడా అనుమతించరాదని, మార్చి నుంచి మూడు నెలల పాటు ఇంటి అద్దెలు వసూలు చేయకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
లాక్ డౌన్ అమలు కారణంగా కేంద్రంతో పాటు రాష్ట్రాలు తీవ్ర ఆర్ధిక నష్టాలకు నెట్టివేయబడ్డాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే దేశం తీవ్ర ఆర్ధిక మాంధ్యంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఈ కారణంగా కేంద్రం కొన్నింటికి మినహాయింపులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి.
లాక్ డౌన్ సడలింపులోనూ ప్రజలు బయటకు వచ్చినప్పుడు విధిగా మాస్కులు ధరించడంతో పాటు సామజిక దూరం పాటించాలి. గుంపులుగా ఎక్కడా ఉండకూడదు.
కేంద్రం ప్రకటించిన సడలింపులు..
- అత్యవసర, నిత్యవసర సరుకుల సరఫరా కొనసాగనుంది.
- వాణిజ్య, ప్రైవేటు వర్తక సంస్థలకు, ప్రభుత్వ, ప్రభుత్వేతర పారిశ్రామిక సంస్థలు పనిచేయవచ్చు.
- నిర్మాణ రంగ కార్యకలాపాలు చేసుకోవచ్చు.
- ప్రైవేటు వాహనాలకు అనుమతి ఇస్తారు. వాటిని అత్యవసర సేవలకు, వైద్య, పశువైద్య సేవలకు, అత్యవసర సరుకులు తేవడానికి, తాము పనిచేసే ఆఫీస్కి వెళ్లడానికి మాత్రమే అవకాశం.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తాయి.
- గ్రామాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ యూనిట్లు పరిశ్రమలు తెరవవచ్చు.
- సినిమా హాళ్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు, జిమ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు మాత్రం మే 3 వరకూ తెరవకూడదు.
- రాష్ట్రాల మధ్య, జిల్లాల మధ్య ప్రజల ప్రయాణాలు, రాకపోకలపై మే 3 వరకూ నిషేధం ఉంటుంది.
- మెట్రో రైళ్లు, బస్సు సర్వీసులు మే 3 వరకూ లాక్డౌన్లోనే ఉంటాయి.
- మే 3 వరకు సభలు, సమావేశాలు, సామాజిక, రాజకీయ, క్రీడా, మతపరమైన కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించకూడదు. అన్ని ప్రార్థనా స్థలాలూ తెరవకూడదు.
- విద్యాసంస్థలు, ట్రైనింగ్, కోచింగ్ కేంద్రాలు… మే 3 వరకూ తెరవకూడదు.
- అంత్యక్రియల కార్యక్రమాల్లో 20 మందికి మించి పాల్గొనకూడదు.
- ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, టెలి మెడిసిన్ సర్వీసులు రోజూ పనిచేస్తాయి. డిస్పెన్సరీస్, కెమిస్ట్స్, ఫార్మసీస్, అన్ని రకాల మందుల షాపులు, జన ఔషధి కేంద్రాలు తెరిచే ఉంటాయి. మెడికల్ ల్యాబ్స్, వైద్య ఉత్పత్తుల కలెక్షన్ కేంద్రాలు తెరిచే ఉంచవచ్చని కేంద్రం తన మార్గదర్శకాల్లో తెలిపింది.
ఈ నేపథ్యంలో ఏపీలో లాక్డౌన్ ఆంక్షల సడలింపునకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ విడుదల చేశారు.