వాషింగ్టన్: భారతదేశం చేసిన ఉపగ్రహ విధ్వంసక పరీక్ష ‘ఎశాట్’పై అమెరికా నిఘా వేసిందా? హిందూ మహాసముద్రంలో ఉన్న తన డిగో గార్షియా స్థావరం నుంచి నిఘా విమానాన్ని పంపి మొత్తం పరీక్షను పరిశీలించిందా? ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి. అయితే అమెరికా రక్షణ శాఖ మాత్రం వాటిని ఖండిస్తోంది. భారతదేశం ఇలాంటి ఉపగ్రహ విధ్వంసక పరీక్ష చేస్తున్న విషయం తమకు తెలుసని, కానీ తాము మాత్రం ఎప్పుడూ నిఘా పెట్టలేదని అమెరికా రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ డేవిడ్ డబ్ల్యు ఈస్ట్ బన్ తెలిపారు. అమెరికా ఎప్పుడూ భారతదేశంతో తన భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవాలనే భావిస్తోందన్నారు. రెండు దేశాల మధ్య పరస్పర సంబంధాలు, బలమైన ఆర్థిక బంధాలు ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు.
అయితే సైనిక విమానాల కదలికలను గమనిస్తూ ఉండే ఎయిర్ క్రాఫ్ట్ స్పాట్స్ అనే సంస్థ మాత్రం, అమెరికా వైమానిక దళానికి చెందిన నిఘా విమానం ఒకటి డీగో గార్షియా స్థావరం నుంచి బంగాళాఖాతంలో భారతదేశం చేస్తున్న పరీక్షలను చూసేందుకు వెళ్లినట్లు చెప్పింది. దీంతో ఎశాట్ పరీక్షపై అమెరికా నిఘా పెట్టిందని పలువురు భావించారు. ఇలా చేస్తే భారత్ అమెరికాల మధ్య సమన్వయం అంతగా ఉంటుందనుకోనని వ్యోమగామి జొనాథన్ మెక్ డోవెల్ అన్నారు. అమెరికా నిఘా విభాగానికి పరీక్ష గురించి ముందే తెలుసని, అంటే వాళ్లు కొంతమేర నిఘా ఉంచినట్లేకదా అని ఆయన అన్నారు. ప్రతివాళ్లూ తమ స్నేహితులు, శత్రువుల మీద నిఘా ఉంచుతారని, ప్రపంచమంతా అలాగే పనిచేస్తోందని చెప్పారు. అమెరికా నిఘా పెట్టలేదంటేనే ఆశ్చర్యపోవాలన్నారు.
అయితే పెంటగాన్ మాత్రం నిఘా ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. రెండు దేశాల మధ్య బంధం చాలా బలంగా ఉందని, అది అపరిమితమని లెఫ్టినెంట్ కల్నల్ ఈస్ట బన్ అన్నారు. ఇరు దేశాలు స్వేచ్ఛా వాణిజ్యం, అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉండటం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోడానికి కట్టుబడి ఉన్నాయని చెప్పారు. భారత్ ఎశాట్ పరీక్ష చేస్తోందన్న విషయం మాత్రం తమకు ముందే తెలుసని ఎయిర్ ఫోర్స్ స్పేస్ కమాండ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డేవిడ్ డి థాంప్సన్ తెలిపారు. సెనేట్ సైనిక వ్యవహారాల సబ్ కమిటీకి ఆయనీ వివరాలు చెప్పారు. పరీక్ష జరిగే సమయాన్ని కూడా వెల్లడించారు. ఎయిర్ ఫోర్స్ మిసైల్ వార్నింగ్ సిస్టమ్స్ దాన్ని గుర్తించిందన్నారు. అది లక్ష్యాన్ని ఛేదించగానే దాని గురించిన సమాచా సేకరణ మొదలైందన్నారు.