విజయవాడ: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుకోంటోంది. గత నెలలో ఎగువ రాష్ట్ర వరద కారణంగా కృష్ణానది పరవళ్లు తొక్కుతూ ప్రవహించిన విషయం తెలిసిందే. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పొటెత్తగా బ్యారేజ్ అన్ని గేట్లను ఎత్తి వందలాది టిఎంసిల నీరును సముద్రంలోకి విడుదల చేశారు.
ఇప్పుడు ఖమ్మం జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో మున్నేరు, వైరా ఏరు, కట్లేరు, మధిర వాగుల నుంచి పెద్ద ఎత్తున వర్షపు నీరు కృష్ణానదికి చేరుకోంటోంది. దాదాపు 30వేల క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజి వద్దకు చేరుతున్నది. దీంతో బ్యారేజి మొత్తం 20 గేట్లను అడుగు మేర ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్నారు. 18500ల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో కలుస్తున్నది. మరో 14,500 క్యూసెక్కుల నీరు అధికారులు కాల్వలకు విడుదల చేస్తున్నారు.
గత నెలలో వచ్చిన వరదల కారణంగా సుమారు 300 టిఎంసిల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజికి ఎగువ, దిగువ భాగాలో కృష్ణానది నిండుకుండలా ప్రవహిస్తున్నది.
మరో రెండు, మూడు రోజుల పాటు ఖమ్మం జిల్లా నుంచి వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.
వరద కారణంగా వినాయక నిమజ్జనానికి జరుగుతున్న ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది. ప్రతి ఏటా బ్యారేజీకి దిగువన విగ్రహ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేస్తుంటారు. బ్యారేజి 20 గేట్లను ఎత్తడంతో నిమజ్జన ఏర్పాట్ల పనులకు ఆటంకం కలుగుతోంది.