న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అక్టోబర్ లో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. అన్ని పిటిషన్లను విచారిస్తుందని తెలిపింది. ఈ అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ మొదటివారం నుంచి ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. అయితే, ఈ అంశంపై కేంద్రానికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరంలేదంటూ ప్రభుత్వం తరపు లాయర్ పేర్కొనడంతో సుప్రీం స్పందిస్తూ.. ‘ఏమి చేయాలో మాకు తెలుసు. మేము ఆదేశాలు ఇచ్చాం. ఇందులో ఇక ఎలాంటి మార్పు ఉండదు’ అని వ్యాఖ్యానించింది.
కశ్మీర్లో మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ బేసిన్ వేసిన పిటిషన్ను కూడా సుప్రీం కోర్టు విచారించింది. ఈ వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలని కేంద్రంతో పాటు జమ్మూకశ్మీర్ పాలనా యంత్రాంగానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అందుకు వారం రోజుల గడువు విధించింది. అధికరణ 370 రద్దు నేపథ్యంలో మీడియా, ఇంటర్నెట్, మొబైల్ సేవలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 5న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే ఈ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కశ్మీర్ వ్యాప్తంగా ఆంక్షలు విధించింది. మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రముఖ రాజకీయ నాయకులను గృహనిర్బంధం చేసింది. రాజకీయ ప్రముఖులెవరూ కశ్మీర్ రాకుండా అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. అయితే వీటన్నింటినీ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.