అమరావతి: శాసనసభ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని పొందిన తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణాలు వెతుక్కునే కార్యక్రమం సాగుతోంది. అయితే ఈలోపు చేయాల్సిన పని ఒకటి వచ్చిపడింది. శాసనసభలో పార్టీని ఎవరు ముందుకు నడుపుతారో తేల్చాల్సిన అవసరం వచ్చింది.
మామూలుగా అయితే ఇది చర్చకొచ్చే అంశమే కాదు. పార్టీని కష్టనష్టాలలో ఓపిగ్గా నడుపుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు శాసనసభలో లెజిస్లేచర్ పార్టీ నాయకుడి పాత్ర పోషించడానికి వెనుకాడుతున్నారు. అందువల్ల పార్టీలో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. రేపు జరిగే టిడిఎల్పి సమావేశంలో నాయకుడిని ఎన్నుకోవాల్సిఉంది.
చంద్రబాబు వెనుకాడడానికి కారణం ప్రధానంగా ఒకటే. 69 ఏళ్ల చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో తలపడిన నాయకుడు. ఇప్పుడు ఆయన కుమారుడు 46 ఏళ్ల జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే తాను ప్రతిపక్ష నేతగా ఉండాల్సిరావడం చంద్రబాబుకు మింగుడు పడడం లేదు. అదీ అవమానకరమైన సంఖ్యబలంతో.
ఈ ఎన్నికలలో టిడిపికి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. 151 మంది సభ్యుల వైసిపి శాసనసభలో ప్రతిపక్షాన్ని నోరెత్తనివ్వకుండా చేస్తుందన్న విషయంలో టిడిపికి అనుమానం లేదు. ఈ ఎన్నికలలో అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షం పరిధులు దాటి వ్యక్తిగత దాడులతో ప్రచారం చేశాయి. దానికి తోడు జగన్పై ఉన్న అవినితి కేసులను చంద్రబాబు ఎంత గట్టిగా ప్రస్తావించారో జగన్ కూడా అంతకన్నా గట్టిగా చంద్రబాబుపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. చివరికి ప్రజలు వైసిపికి పట్టం కట్టారు కాబట్టి చంద్రబాబు రేపు గట్టిగా నోరు తెరిచేందుకు వెనుకాడాల్సిన పరిస్థితి.
వైసిపి ప్రతిపక్షంలో ఉన్నంత కాలం టిడిపితో గట్టిగా తారసిల్లుతూ వచ్చింది. తమ సభ్యులను టిడిపిలో చేర్చుకుని మంత్రిపదవులు కూడా ఇచ్చి చంద్రబాబు అనైతిక రాజకీయాలు చేస్తున్నారంటూ జగన్ శాసనసభనే బహిష్కరించారు. శాసనసభ వెలుపల చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు శాసనసభలో ఎదురెదురుగా కూర్చుని జగన్ విమర్శలు చేస్తే చంద్రబాబు తట్టుకోగలరా? ఇలాంటి పరిస్థితుల్లో టిడిఎల్పి నాయకత్వం మరెవరికైనా ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయడు పేరు ప్రస్తావనకు వచ్చిందని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు తప్పుకుంటే పారిపోయారన్న అపప్రధ వస్తుందన్న అనుమానం కూడా లేకపోలేదు.