తాడేపల్లి : శివరామకృష్ణన్ కమిటీ అమరావతిలో రాజధాని కట్టవద్దని చెప్పిన విషయాన్నే మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రస్తావించారు తప్ప రాజధానిని మారుస్తారని ఆయన అనలేదని వైసిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. ఆ రెండు పత్రికలు వాటి ఇష్టమొచ్చినట్లు రాస్తున్నాయని అంబటి దుయ్యబట్టారు. అమరావతి, పోలవరంపై చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని అంబటి కోరారు.
వైసిపి కేంద్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బిజెపి, టిడిపి నేతల వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
పచ్చరక్తంతో బిజెపి తన సహజత్వం కోల్పోతున్నదనీ, కమలవనంలో ఉన్న పచ్చ పుష్పాలే సిఎం జగన్మోహనరెడ్డిపై విమర్శలు చేస్తున్నారని రాంబాబు అన్నారు.
వరద సమయంలో తన ఇల్లు మునిగిపోతుందని తెలిసే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని అంబటి విమర్శించారు. నాగార్జునసాగర్ గేట్లు మూసివేసిన తరువాత ఆయన విజయవాడ వచ్చారని అన్నారు. చంద్రబాబు ధోరణి చూస్తుంటే వరదలోనూ సానుభూతి పొందాలని చూస్తున్నట్లుందని అంబటి విమర్శించారు. కృష్ణానదిలో వరదలు సృష్టించడం మానవులకు సాధ్యమవుతుందా? చేయి నొప్పి ఉంటే హైదరాబాద్ వెళ్లడం ఏమిటీ, విజయవాడలో డాక్టర్లు లేరా? చంద్రబాబు హైదరాబాదు వెళితే మరి లోకేష్ ఎక్కడికి వెళ్లారంటూ అంబటి ప్రశ్నల వర్షం కురిపించారు. నదీ గర్బంలో ఉంటూ తన ఇల్లు ముంచేశారని చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అంబటి అన్నారు.
అమెరికాలోని ఒక కార్యక్రమంలో జగన్మోహనరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయలేదనీ, ఆయన హిందు వ్యతిరేకి అనీ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అంబటి అన్నారు. అమెరికాలో ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా జ్యోతిని వెలిగిస్తారనీ, అదే జగన్మోహనరెడ్డి చేశారనీ దీనిపై అసత్యాలు మాట్లాడటం నేరమని అంబటి అన్నారు.
సిఎం రమేష్ బిజెపిలో ఉన్న పచ్చ కోవర్ట్ అని అంబటి ఆరోపించారు. చంద్రబాబు హయాంలో విజయవాడ నడిబొడ్డున ఆలయాలు కూలగొడితే మాణిక్యాలరావు ఏమయ్యారని అంబటి ప్రశ్నించారు. సదావర్తి భూములను అన్యాయంగా వేలం పాట వేస్తే మాణిక్యాలరావు మంత్రిగా ఉండి కూడా గుడ్లగూబలా చూస్తూ ఉండిపోయారని అంబటి విమర్శించారు.
అసెంబ్లీ వస్తువులను దొంగతనం చేసి దొరికిపోయిన తరువాత కోడెల ఆ వస్తువులను తిరిగి ఇచ్చేస్తామంటున్నారని అంబటి విమర్శించారు. కోడెలపై కేసులు పెట్టింది టిడిపి నాయకులేనన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలని అంబటి అన్నారు. చంద్రబాబు ఆశీస్సులతోనే కోడెల కోట్ల రూపాయలు దోచుకున్నారని అంబటి విమర్శించారు.
రాజధాని, పోలవరం, అన్న క్యాంటిన్లలో టిడిపి నేతలు వేల కోట్ల రూపాయలు కాజేశారనీ అంబటి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో కమలం వనం కాస్త పచ్చవనంగా మారుతోందనీ, బిజెపి నేతలు జాగ్రత్తగా ఉండాలని అంబటి అన్నారు. సమయం వచ్చినప్పుడు వాళ్లు అంతా తిరిగి చంద్రబాబు పక్కకే చేరతారని అంబటి పేర్కొన్నారు.