అమరావతి: రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ప్రతి 50 ఇళ్లకూ ఒకరు చొప్పున నాలుగు లక్షల మంది గ్రామ వలంటీర్లను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. గురువారం విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆయన ఈ ప్రకటన చేశారు. గ్రామ వలంటీర్లకు నెలకు అయిదు వేల రూపాయల వేతనం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఆగస్టు 15 నాటికి ఈ నియామకాలు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు.
గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి వాటిల్లో గ్రామానికి పది మంది చొప్పున ఉద్యోగస్తులను నియమిస్తామని జగన్ చెప్పారు. వీరు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ సేవలు అందరికీ అందుబాటులో ఉండేట్లు చూస్తారని ఆయన అన్నారు. ఈ ఉద్యోగాలు మొత్తం లక్షా 60 వేలు వచ్చే గాంధీజయంతి నాటికి అందుబాటులోకి వస్తాయని జగన్ చెప్పారు. గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు, గ్రామ వలంటీర్ల ఉద్యోగాలు కలిపితే మొత్తం అయిదు లక్షల 60 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రభుత్వ సర్వీసులను కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీ అంటూ తారతమ్యం చూపకుండా అందరికీ అందుబాటులోకి తేవడం లక్ష్యంగా ఈ ఉద్యోగాలు ప్రకటిస్తున్నట్లు జగన్ చెప్పారు. లంచాలను పూర్తిగా రూపుమాపడం దీని ఉద్దేశమని ఆయన అన్నారు. ఎవరైనా ఎక్కడైనా లంచం అడిగితే, ప్రభుత్వ సర్వీసులు అందడం ఆలస్యమైతే నేరుగా ముఖ్యమంత్రి కాల్ సెంటర్కు ఫోన్ చేసి ఫిర్యాదు అందించవచ్చని ఆయన చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.