కర్నూలు, మార్చి 18: ‘పాదయాత్రలో మీ కష్టాలు చూసా, బాధలు విన్నాను, మీ అందరికీ నేను ఉన్నాను’ అంటూ వైసిపి అధినేత వైఎస్ జగన్ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. వైసిపి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఈ సభల్లో జగన్ చంద్రబాబు ఐదేళ్ల పాలనను తూర్పారబట్టారు. ఐదేళ్లు ప్రజల గురించి పట్టించుకోని ఈ పెద్ద మనిషి చంద్రబాబుకు ఎన్నికలు దగ్గర పడటంతో అవ్వా, తాత పెన్షన్ గుర్తుకు వస్తారని జగన్ అన్నారు.
చంద్రబాబు పాలనలో గ్రామాల్లో పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీలు అడిగే ప్రశ్నలు విన్నాను, అధికారులకు లంచాలు ఇవ్వందే ఏ ఒక్క పని జరగదు అని అన్నారు. వైసిపి అధికారంలోకి రాగానే ఈ జన్మభూమి కమిటీలను రద్దు చేస్తామని జగన్ అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేద ప్రజల కోసం ఆరోగ్య శ్రీ వైద్యసేవలు, 108 అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వ హయాంలో పేదలు వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైసిపి అభ్యర్థులను గెలిపిస్తే మంచి పరిపాలన అందిస్తానని జగన్ హామీ ఇచ్చారు.
చంద్రబాబు మోసపూరిత పాలనను ప్రజలు అర్థం చేసుకున్నారనీ, జనాల్లోకి వెళితే ఓట్లు వేయరని ఆయనకు తెలుసుకాబట్టే ఎన్నికలకు ముందు వైసిపి ప్రకటించిన నవరత్న పథకాలను కాపీ కొట్టి ఫింఛన్లను పెంచారని అన్నారు.
బాబు వల్ల రాష్ట్రానికి పట్టిన దిష్టి ఎన్ని కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొట్టినా పోదని జగన్ ఎద్దేవా చేశారు. రుణ మాఫీ చేస్తానని రైతులను నట్టేట ముంచారు, హెరిటేజ్ లాభాల కోసం రైతుల జీవితాలను తాకట్టు పెట్టారని జగన్ విమర్శించారు.
ఆయన చేస్తున్న మోసాలు, అన్యాయాలు చూస్తున్నాము, ఎలాగైనా గెలువడం కోసం ఓట్లు తీసేస్తారు, ఆధార్ వివరాలు, బ్యాంకు అకౌంట్లు చోరీ చేస్తారు, చివరకు మన ఇంటిలోని ఆడపిల్లల ఫోన్ నెంబర్లు కూడా సేకరించి ఆ పార్టీ కార్యకర్తలకు ఇస్తారని విమర్శించారు. బలమైన ప్రత్యర్థులను ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టేందుకు హత్యారాజకీయాలు కూడా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన చేయించిన నేరాలకు ఎదుటివారిపై నెపం వేస్తాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ పెద్ద మనిషి మరో 20 రోజులు ఇటువంటి కట్టుకధలు ఏన్నో చెబుతారు, ఎన్నో సినిమాలు చూపిస్తారు అని జగన్ అన్నారు.
ఈ ఎన్నికల్లో మనం చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ పార్టీకి అమ్ముడు పోయిన టివి ఛానెళ్లతో పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు.
వైసిపి అధికారంలోకి రాగానే అమలు చేయనున్న పథకాలపై హామీలు ఇస్తూ వైసిపి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని జగన్ కోరారు.