తెలంగాణలో కోవిడ్-19 కేసులు రోజూ వందల్లో నమోదు అవుతుంటే అందులో 90 శాతం జీహెచ్ఎంసీ పరిధిలోని కావడం గమనార్హం. దీంతో తెలంగాణ ప్రభుత్వం మొత్తం గాంధీ ఆసుపత్రి ని కరోనా కోసం ప్రత్యేకంగా కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆస్పత్రి లో కరోనా పేషెంట్లు లోపల ఉంటే వైద్యులు మాత్రం బయట ధర్నా చేస్తున్నారు.
నిన్న ఒక రోగి మృతిచెందడంతో అతడి బంధువులు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రిలోని డాక్టర్ల పై దాడులు చేయడంతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. 55 ఏళ్ల వ్యక్తి సోమవారం ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. సదరు రోగికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉండడం వలన కరోనా వల్ల అతని పరిస్థితి మరింత విషమించి ప్రాణాలు కోల్పోగా అతడి బంధువులు ఆగ్రహం పట్టలేక జూనియర్ డాక్టర్ పైన దాడి చేశాడు.
అయితే వైద్యులు మాత్రం అతనికి ఆరోగ్య తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయని మంచం దిగవద్దని చెప్పినా వినిపించుకోకుండా బెడ్ దిగి బాత్ రూం కు వెళ్లి అక్కడ కూలబడి చనిపోయాడని చెబుతున్నారు. కానీ బంధువులు మాత్రం ఇది మీ నిర్లక్ష్యమే అంటూ వైద్యుడి పైన ప్లాస్టిక్ కుర్చీలు విసరడం ఆ తర్వాత ఐరన్ కుర్చీ తో కొట్టడం వంటివి చేశారట. దీంతో ఆ వైద్యుడికి తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే గాంధీ ఆస్పత్రి వైద్యులు విధులు బహిష్కరించి ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. ఇక గత 24 గంటల్లో కనీసం ఒక వంద పాజిటివ్ కేసులు నమోదు అవకాశం ఉండటంతో వైద్యులు విధులు బహిష్కరించి ఈ సమయంలో ధర్నా చేయడం మాత్రం మంచి పరిణామం కాదని ప్రజలు భావిస్తున్నారు. అలాగే వారిపై దాడికి పాల్పడిన వారిని కూడా కటినంగా శిక్షించాలని కోరుతున్నారు.