అనకాపల్లి, ఏప్రిల్ 2 : విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంటరీ సీటు బరిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తలబడుతున్నారు. ఈ పార్లమెంటరీ సీటును మాజీ ఎంపి కొణతాల రామకృష్ణకు కేటాయించాలన్న ఉద్దేశంతో చివరి వరకూ ప్రధాన రాజకీయ పార్టీలైన టిడిపి, వైసిపిలు అభ్యర్థులను ఖరారు చేయలేదు. కొణతాల రామకృష్ణ ముందుగా వైసిపిలో చేరతారన్న వార్తలు వచ్చాయి. కానీ ఆయన వైసిపిలో చేరలేదు. ఈ నేపథ్యంలో టిడిపి నుంచి వచ్చి చేరిన వైద్యురాలు బివి సత్యవతిని వైసిపి అభ్యర్థిగా ప్రకటించింది. అభ్యర్థుల ప్రకటన వెలువడే వరకూ కొణతాల పార్టీలో చేరేదీ లేనిదీ తెలియజేయకపోవడంతో టిడిపి చివరకు తులసి డైరీ యజమాని ఆడారి తులసీరావు కుమారుడు ఆడారి ఆనంద్ కుమార్ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. జనసేన పార్టీ తరపున మాజీ ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ చింతల పార్థసారధి బరిలో ఉన్నారు. జనసేనాని పవన్ కళ్యణ్కు రాజకీయ సలహదారుడైన పార్థసారధి గతంలో ప్రముఖ సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలక భూమిక పోషించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి జనసేన కార్యకర్తలకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించారు. ఇక బిజెపి అభ్యర్థిగా గాంధీ వెంకట సత్యనారాయణ, కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీరామమూర్తి రంగంలో ఉన్నారు.
వివిధ రాజకీయ పార్టీల నుండి పోటీ చేస్తున్నవీరు తొలి సారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధానంగా టిడిపి, వైసిపి, జనసేన అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ కనబడుతోందని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో టిడిపి నుండి ఎంపిగా 47వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) వైసిపిలో చేరారు. ఇప్పుడు ఆయన భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి సబ్బం హరి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన భీమిలి అసెంబ్లీ నుండి టిడిపి అభ్యర్థిగా అవంతి శ్రీనివాస్తో తలపడుతున్నారు. నామినేషన్ కార్యక్రమాలు పూర్తి అయి ప్రచార పర్వాలు ప్రారంభం అయిన తరువాత మాజీ ఎంపి కొణతాల రామకృష్ణ టిడిపిలో చేరారు. టిడిపి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.
2009లో ఈ పార్లమెంటరీ సీటుకు పిఆర్పి అధినేత చిరంజీవి బావ అల్లు అరవింద్ పోటీ చేసి 2,94,183 ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు. నాడు టిడిపి అభ్యర్థి నూకారపు సూర్యప్రకాశరావు 3,17,056ఓట్లతో రెండవ స్థానంలో నిలబడగా, కాంగ్రెస్ అభ్యర్థిగా సబ్బం హరి 3,69,968ఓట్లు సాధించి 52వేల మెజార్టీతో విజయం సాధించారు.
ఈ నియోజకవర్గ పరిధిలోని మరో సీనియర్ నాయకుడైన దాడి వీరభద్రరావు ఎన్నికల తరుణంలోనే టిడిపి నుండి వైసిపిలో చేరారు. నియోజకవర్గ పరిధిలోని పలువురు నాయకులు ఈ ఎన్నికల తరుణంలో పార్టీలు మారడంతో అభ్యర్థుల గెలుపు ఓటములు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.
ప్రభుత్వ వ్యతిరేకత, జగన్మోహనరెడ్డి కరిష్మా, ఆయన ప్రకటించిన నవరత్న పథకాలు, పటిష్టమైన పార్టీ క్యాడర్ తన విజయానికి కారణం అవుతాయని వైసిపి అభ్యర్థిని డాక్టర్ సత్యవతి ధీమా వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు అందిస్తున్న పరిపాలన, పార్టీ క్యాడర్ తన గెలుపుకు దోహదపడతాయని టిడిపి అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరిష్మాతో పాటు వామపక్షాలు, బిఎస్పీ శ్రేణుల సహకారంతో తాను విజయం సాధిస్తానని జనసేన అభ్యర్థి, మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారధి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ పార్లమెంట్ సీటు నుండి 1989 ఎన్నికల్లో కొణతాల రామకృష్ణ కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో విజయం సాధించారు.