సముద్రంలోనే ఎక్కువ కాలం.. అందుకే బలం
తమిళనాడు నుంచి దిశ మార్చి ఒడిశా వైపు
వాతావరణ శాస్త్రవేత్తల అంచనా
ఒడిశాలోని పూరి వద్ద తీరాన్ని తాకేందుకు అత్యంత శక్తిమంతమైన ఫోని తుపాను సిద్ధమవుతోంది. ఆ సమయంలో గాలి వేగం గంటకు 200 కిలోమీటర్లు దాటుతుందని అంచనా. చిట్టచివరిసారిగా మయన్మార్ లో ఇంతటి భీకర తుపాను 2008లో వచ్చి, 1.25 లక్షల మంది ప్రాణాలు బలిగొంది. అప్పటికి ఇంత టెక్నాలజీ లేక, ప్రజలను ఖాళీ చేయించలేదు. కానీ ఆగ్నేయ శ్రీలంకలో వారం క్రితం ఏర్పడినప్పటి నుంచి ఫోనిని గమనిస్తూనే ఉన్నారు. తీరప్రాంత వాసులు, మత్స్యకారులకు హెచ్చరికలు పంపుతున్నారు.
భారత తూర్పు తీరంలో తుపానులు కొత్త కాదు. ప్రతియేటా సగటున ఐదు నుంచి ఆరు తుపానులు వస్తాయి. వర్షాకాలానికి ముందు ఏప్రిల్, మే నెలలు, తర్వాత అక్టోబరు, డిసెంబరు నెలల్లో ఇవి సంభవిస్తాయి. కానీ వీటన్నింటికంటే ఫోని తుపాను కాస్త విభిన్నమైనది. దాని బలం, మార్గం అన్నీ విభిన్నంగానే ఉన్నాయి. ఈ విషయాలను ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ వెల్లడించింది. మామూలుగా అయితే ఏప్రిల్ -మేలలో వచ్చే తుపానులు బలహీనంగా ఉంటాయి. 1891 ఏప్రిల్ నుంచి బంగాళాఖాతంలో తీవ్ర తుపానులు 14 సార్లు ఏర్పడినా, వాటిలో ఒక్కటి మాత్రమే 1956లో భారత భూభాగాన్ని తాకింది. 1990 తర్వాత ఏప్రిల్లో నాలుగే తుపానులు వచ్చాయి.
ఫోని ‘తీవ్ర పెను తుపాను’గా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడే తుపానుల వేగం వాటి కేంద్రం వద్ద ఎక్కువగా ఉంటుంది. కనిష్ఠంగా 30 కిలోమీటర్ల నుంచి గరిష్ఠంగా 222 కిలోమీటర్ల వరకు ఉంటుంది. తుపాను, తీవ్ర తుపాను, పెను తుపాను, తీవ్ర పెనుతుపాను, ఉప్పెన లాంటివి వీటి పేర్లు. ఫోని తుపాను భూమధ్యరేఖకు దగ్గరగా ఏర్పడింది. భూమిని తాకేందుకు చాలాదూరం ప్రయాణించింది. సముద్రపు నీరు వేడిగా ఉన్నప్పుడు తుపానులు ఏర్పడతాయి. సముద్ర పైభాగం నుంచి 60 మీటర్ల లోతుకు కనీసం 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటేనే తుపాను ఏర్పడుతుంది. తర్వాత, నీటిపై దిగువగా ఉండే గాలి అససవ్య దిశలో తిరగాలి. ఈ సమయాల్లో బంగాళాఖాతంలో ఒక జోన్ ఉంటుంది. దాని దక్షిణ సరిహద్దు పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్లే గాలులకు గురవుతుంది. ఉత్తర సరిహద్దుకు తూర్పు నుంచి పశ్చిమానికి వెళ్లే గాలి తగులుతుంది. ఇవి అపసవ్య దిశలో ఉంటాయి. తుపానులు సముద్రంలో ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత బలపడతాయి. ఏప్రిల్ -మే, అక్టోబరు-డిసెంబరు తుపానుల బలాల మధ్య చాలా తేడా ఉంటుంది. మొదటివి బంగాళాఖాతాంలో భూమికి దగ్గరగానే ఏర్పడతాయి. రెండోవి పసిఫిక్ సముద్రంలో ఏర్పడి, బంగాళాఖాతంలోకి వస్తాయి. అవి బలహీనపడి, ఆగ్నేయాసియాలో భూమిని తాకుతాయి.
సాధారణంగా బంగాళాఖాతంలో తుపానులు చెన్నై లేదా తిరువనంతపురం సమీపంలో ఏర్పడతాయి. కానీ ఫోని మాత్రం శ్రీలంక దిగువన ఏర్పడింది. అక్కడినుంచి ఒడిశా తీరం వరకు ప్రయాణిస్తూ బలం పుంజుకుని వస్తోంది. తొలుత తమిళనాడువైపు వాయవ్యంగా వెళ్లింది గానీ, మధ్యలో దారి మార్చుకుని ఈశాన్యంగా ప్రయాణించి ఒడిశా వైపు వచ్చింది. దాంతో సముద్రంలో మరింత ఎక్కువ సమయం ఉంది. తమిళనాడు దగ్గరే భూమిని తాకితే అది మామూలు తుపానుగానే ఉండేదని, కానీ దిశమార్చుకుని అటు వెళ్లడంతో సముద్రంలో ఎక్కువ కాలం ఉండి బలం పుంజుకుందని ఐఐటీ భువనేశ్వర్ లోని వాతావరణ శాస్త్రవేత్త యూసీ మొహంతి తెలిపారు.