అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా అభినందన తీర్మానంపై సభ్యుల ప్రసంగాలు వాడిగావేడిగా సాగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్ తమ్మినేని సీతారాంను అభినందిస్తూ ప్రసంగించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన ప్రసంగంలో తమ్మినేని సీతారాంను స్పీకర్గా ఎందుకు ఎంపిక చేసింది వివరిస్తూ గత శాసనసభ వ్యవహారాల తీరును తూర్పారబట్టారు. శాసనసభ హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడతారన్న ఉద్దేశంతో సీతారాం గారికి ఎంపిక చేశామని అన్నారు. ఇదే సభలో విలువలు లేని రాజకీయలను చూశాము, ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వని రాజకీయాలు చూశామని జగన్ అంటూ తాను కూడా అలాగే చేస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదని అన్నారు. చట్టసభలపై అవగాహన ఉన్న వ్యక్తిని స్పీకర్గా ఎంపిక చేశామని జగన్ పేర్కొన్నారు. టిడిపి హయాంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులు చేశారనీ, పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా జగన్ ప్రస్తావిస్తూ స్పీకర్ ఎలా ఉండకూడదో గత సభలో చూశామనీ, అయితే స్పీకర్ అంటే ఎలా ఉండాలో ఇప్పుడు చూపిస్తామని అన్నారు. నాడు వారు ఎంత మంది ఎమ్మెల్యేలను, ఎంపిలను అన్యాయంగా లాక్కున్నారో అన్ని స్థానాలనే వారికి వచ్చేలా భగవంతుడు చేశాడనీ సిఎం జగన్ పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడే సమయంలో మైక్ సరిగా పని చేయలేదు. మాట సరిగా రావడం లేదంటూ అధికారపక్ష సభ్యులు ఎద్దేవా చేశారు. ‘నా వాయిస్ ఏమీ తగ్గలేదు, నేను ఈ రోజు వివాదాలకు పోదల్చుకోలేదు‘ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో పని చేయడం తమకు కొత్త కాదనీ, ప్రతిపక్షంలో ఉండటం ఇది మూడవ సారి అని చంద్రబాబు అన్నారు. ఇక్కడ ఉన్నవాళ్లందరిలో తానే సీనియర్ని అంటూ ప్రతిపక్షంలో ఉన్నా పోరాటం కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పారు. అనంతరం పలువురు సభ్యులు స్పీకర్కు అభినందనలు తెలియజేస్తూ ప్రసంగాలు చేశారు.
కాగా స్పీకర్ను చైర్లో కూర్చోపెట్టేందుకు ముఖ్యమంత్రితోపాటు లేచి వెళ్లకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు తన స్థానంలోనే కూర్చుని ఉండిపోవడంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాద ప్రతివాదనలు జరిగాయి. బలహీనవర్గానికి చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్గా ఎన్నికయితే స్పీకర్ను స్వాగతించడానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రాకుండా ‘బంట్రోత్’ను పంపారంటూ అధికారపక్ష సభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అనడంతో తీవ్ర దుమారం రేగింది. సభా సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించాలి, ఆహ్వానం లేకుండా పిలవని పేరంటానికి వస్తారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రొటెం స్పీకర్ సభానాయకుడు, ఇతర పార్టీల సభ్యులూ స్వీకర్ను ఆహ్వనించాలని చెప్పారనీ కావాలంటే రికార్డు పరిశీలించుకోవచ్చని అన్నారు. మీరు క్షమాపణ చెప్పాలంటే మీరు క్షమాపణ చెప్పాలంటూ అధికార విపక్ష సభ్యులు డిమాండ్ చేసుకున్నారు. దీనిపై రికార్డు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని స్పీకర్ తమ్మినేని సీతారాం సభ్యులకు తెలిపారు. ‘బంట్రోత్’అంటే సేవకుడు అని అర్థమని, తాను అన్నదానిలో తప్పేమిలేదని చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేర్కొన్నారు.