అమరావతి: గత చంద్రబాబు హయాంలో వివిధ ప్రాజెక్టులు, ఒప్పందాలు తదితర కాంట్రాక్ట్ పనుల్లో అవినీతి, అక్రమాలను వెలికితీసేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంపై మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సిఎం జగన్మోహనరెడ్డిపై విమర్శలు చేశారు. జగన్మోహనరెడ్డి కల..కలగానే మిగిలిపోతుందని లోకేష్ అన్నారు.
అక్రమార్కుల కేసులలో జగన్పై లెక్కకు మించి చార్జిషీట్లు ఉన్నాయని లోకేష్ అన్నారు. నిందితుడిగా జైలులో ఉండి వచ్చిన జగన్ నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండటం ఏమీ బాగోలేదని లోకేష్ పేర్కొన్నారు.
‘మీ బాబు, మా బాబుపై 26 కమిటీలు వేశారు. అవినీతి ముద్రవేయాలని అడ్డదారులు తొక్కారు. చివరికి ఆయన తరం కాలేదు. ఇప్పుడు మీ తరమూ కాదు. వంశధారపై మీరు వేసిన కమకిటీ రూపాయి అవినీతి జరగలేదని నివేదికిచ్చింది’ అని లోకేష్ పేర్కొన్నారు.
పోలవరంపై టిడిపి హయాంలో పంపిన అంచనాలన్నింటికీ కేంద్రం ఒకే చెప్పిందని లోకేష్ అన్నారు. అందరూ మీలా అవినీతిపరులే అని ముద్ర వేయాలి అనుకుంటున్న మీ కల..కలగానే మిగిలిపోతుందని లోకేష్ ఎద్దేవా చేశారు.