అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమ్మఒడి పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థినీ విద్యార్థులకు వర్తింపజేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకూ చదివే విద్యార్థులకు మాత్రమే ఈ పథకం అమలు చేసేందుకు ప్రారంభించారు. గురువారం నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో ఈ పథకాన్ని ఇంటర్ వరకూ విస్తరింపజేయాలని నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలలో చదివించే తల్లులకు ఈ పథకం కింద ఏడాదికి 15వేల రూపాయలు చెల్లించనున్నారు. హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని సిఎం జగన్మోహనరెడ్డి తెలిపారు. పిల్లలను చదివించే తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి తల్లికి ఏటా 15వేల రూపాయలు ఇస్తామని జగన్ పునరుద్ఘాటించారు.
విశ్వవిద్యాలయాల్లో విసిల నియాకమం కోసం వెంటనే సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. రాబోయే 30రోజుల్లో విసిల నియామకాలు పూర్తి కావాలని జగన్ స్పష్టం చేశారు. పారదర్శక విధానంతో అత్యంత అనుభవం ఉన్న వారినే విసిలుగా ఎంపిక చేయాలని జగన్ సూచించారు. విశ్వవిద్యాలయాల్లో ఉన్న అన్ని ఖాళీ పోస్టులను ఏడాది చివరికల్లా భర్తీ చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల ఆధునీకరణ, మౌలిక వసతుల పెంపు తదితర విషయాలపై చర్చించి పలు సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.