అమరావతి: చంద్రబాబు ఐదేళ్లుగా నివాసం ఉంటున్న లింగంనేని ఎస్టేట్ అక్రమ నిర్మాణం అయినందున తక్షణం ఖాళీ చేయాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా నేడు విజయసాయిరెడ్డి పలు విమర్శలు చేశారు. ఆ భవనం రాజశేఖరరెడ్డి హయాంలోనే కట్టారుగా అనే మూర్ఖపు లాజిక్కులతో తప్పించుకోలేరనీ, నదీ గర్భంలో నిర్మించిన భవనమని తేలాక కూల్చివేయడం తప్ప వేరే పరిష్కారమే ఉండదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
ప్రజావేదిక అనే రేకుల షెడ్డు నిర్మాణంలో సిమెంట్ కంటే సినిమా సెట్టింగ్ల్లో వాడే ప్లాస్టర్ ఆఫ్ పారిస్నే ఎక్కువగా వాడినట్లు కనిపిస్తోందనీ, కోటి ఖర్చయ్యే తాత్కాలిక నిర్మాణానికి 9కోట్ల రూపాయలు ఖర్చయినట్లు చూపారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇదో చిన్న నమూనానే, చంద్రబాబు హయాంలో జరిగిన నిర్మాణాలన్నీ ఇలాగే ఉంటాయనిపిస్తోందని విజయసాయిరెడ్డి విమర్శించారు.
ప్రజావేదిక షెడ్డు కూల్చివేతను చూసేందుకు వచ్చిన ప్రజలకున్న అవగాహన కూడా టిడిపి నేతలకు లేకపోవడం దురదృష్టకరమని విజయసాయిరెడ్డి అన్నారు. రాజధాని కోసం 33వేల ఎకరాలు సేకరించిన చంద్రబాబు ప్రజావేదికను కరకట్టకు బదులుగా ఆ భూముల్లో కట్టి ఉంటే నేడు ప్రజాధనం వృధా అయ్యేది కాదుకదా అని రైతులు ప్రశ్నిస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.