నాగార్జునసాగర్ : కర్నాటక, మహారాష్ట్ర నుండి భారీగా వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండుకుండలా కళకళలాడుతున్నాయి. కృష్ణానది వరద ఉదృతి పెరుగుతుండటంతో శ్రీశైలంలో 10గేట్లు, నాగార్జునసాగర్లో 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 7.53లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 8.51లక్షల క్యూసెక్కుల ఔట్ఫ్లో ఉంది. జలశయం 10 గేట్లను 42 అడుగుల మేర పైకెత్తి నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమల జల విద్యుత్ కేంద్రాల ద్వారా 8,20,162 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి 28వేల క్యుసెక్కులు, హంద్రీనావాకు 2,363 క్యూసెక్కులు, ముచ్చుమర్రికి 735 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.60 అడుగులు నమోదైంది. నీటి నిల్వ సామర్థ్యం 215.81 టిఎంసిలకు గానూ ప్రస్తుతం 180.26 టిఎంసిలు ఉంది.
నాగార్జునసాగర్కు 8.25లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా నీటి మట్టం గంటగంటకు పెరుగుతున్నది. దీంతో అధికారులు 26 గేట్లను అయిదు అడుగుల మేర పైకెత్తి 65.207 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590అడుగులు కాగా ప్రస్తుతం 559.20అడుగులు నమోదైంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టిఎంసిలకు గానూ ప్రస్తుతం 230.52 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఇదే మారిదిగా వరద ప్రవాహం కొనసాగితే నేటి సాయంత్రానికి గానీ లేక రేపటికి గానీ పులిచింతల నిండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
నాగార్జునసాగర్ జలకళ సంతరించుకోవడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు మాచర్ల వైపు నుండి సాగర్కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు చేరుకుంటున్నారు.
వీడియో కొరకు క్లిక్ కింద చేయండి