(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తారా? ఒకవేళ నిర్మిస్తే.. ఎక్కడ నిర్మాణం చేస్తారు? ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్గా మారింది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన కొత్త అసెంబ్లీ భవన నిర్మాణంకు ఆది నుండి హంసపాదు అన్నట్లుగా ఉంది. మొదట పెరేడ్ గ్రౌండ్స్లో అసెంబ్లీ నిర్మాణం చేయాలనుకున్నప్పటికి అందుకు కేంద్రం ఒప్పుకోలేదు. దాంతో ఎర్రమంజిల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో అసెంబ్లీని నిర్మించాలని నిర్ణయించారు. జూన్లో కేసీఆర్ కొత్త అసెంబ్లీకి నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున భవనాలను కూల్చి వేస్తున్నారు. అయితే దీనికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఎర్రమంజిల్లో అసెంబ్లీ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
ఎర్రమంజిల్లో భవనాలు కూల్చివేయొద్దంటూ దాఖలైన అన్ని వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు సోమవారం తన తీర్పును వెలువరించింది. గతంలో 294 మందికి ఉపయోగపడిన అసెంబ్లీ ఇప్పుడు ఎందుకు ఉపయోగపడకుండా పోయిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. ఎర్రమంజిల్ లో అసెంబ్లీ నిర్మించొద్దని ఆదేశించింది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చివేతపై నిజాం వారసులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అసెంబ్లీ భవనం కోసం చారిత్రక భవనాన్ని కూల్చడం ఎంత వరకు సమంజసమని పిటిషనర్లు వాదించారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఎర్రమంజిల్లో అసెంబ్లీని కట్టకూడదని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని కాంగ్రెస్, బీజేపీ వంటి విపక్షాలు విమర్శించాయి.
ఎర్రమంజిల్లో మొత్తం 16 ఎకరాల స్థలంలో రూ. 100 కోట్లతో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచించింది. అసెంబ్లీ భవనానికి జూన్ 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వచ్చే ఉగాది లోపు కొత్త సచివాలయంతో పాటు కొత్త అసెంబ్లీ నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా పనులు కూడా జరుగుతున్నాయి. అయితే, హైకోర్టు తీర్పుతో పనులను ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు తీర్పు దృష్ట్యా ఇక పాత అసెంబ్లీ భవనాన్నే తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే, కొత్త అసెంబ్లీని నిర్మించాలని గట్టి పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్..కొత్త వ్యూహాన్ని ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.