(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
వచ్చే నెలలో హర్యానాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఈ మేరకు అమృత్సర్ లో జరిగిన సమావేశంలో ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. సంకీర్ణ ధర్మానికి బీజేపీ తూట్లు పొడిచిందని శిరోమణి అకాలీదళ్ ఆరోపించింది. హర్యానాలో తమకు ఉన్న ఏకైక ఎమ్మెల్యేను లాగేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ లో హర్యానాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని శిరోమణి అకాలీదళ్ పార్టీ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు.
హర్యానాలోని కలన్ వాలీ నియోజకవర్గ అకాలీదళ్ ఏకైక ఎమ్మెల్యే బాల్ కౌర్ సింగ్ గురువారం ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బాల్ కౌర్ సింగ్ మాట్లాడుతూ, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో నీతివంతమైన పాలనను అందిస్తున్నారని కితాబిచ్చారు.
ఈ నేపథ్యంలో శిరోమణి అకాలీదళ్ అధికార ప్రతినిధి దల్జీత్ సింగ్ చీమా బీజేపీపై నిప్పులు చెరిగారు. హర్యానా ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతున్న తరుణంలో తమ ఎమ్మెల్యేను బీజేపీ చేర్చుకోవడం దారుణమని అన్నారు. హర్యానాలో బీజేపీతో తెగతెంపులు చేసుకుంటున్నామని చెప్పారు. బీజేపీ అనైతిక చర్యలకు పాల్పడిందని మండిపడ్డారు. చాలా కాలంగా బీజేపీకి మిత్రపక్షంగా అకాలీదళ్ వ్యవహరించింది. పంజాబ్లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండేది. అయితే 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. పంజాబ్ లో అకాలీదళ్ కు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. లోక్ సభలో ఇద్దరు, రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు.