అమరావతి: టీవీ5 ప్రసారాల నిలిపివేత కేసులో ఏపీ ఫైబర్నెట్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. టీవీ5 ప్రసారాలు పునరుద్ధరించే విషయంలో తమ ఆదేశాలు ఉల్లంఘించినందుకు, గతంలో విధించిన జరిమానా కొనసాగిస్తూ.. రూ. 32 లక్షలు జమ చేయాల్సిందిగా టీడీశాట్(TDSAT) ఆదేశించింది. టీవీ5 ఛానెల్ ప్రసారాలు పునరుద్ధరించాలన్న ఆదేశాలను.. వెంటనే అమలు చేయాలని పునరుద్ఘాటించింది. లేనిపక్షంలో కమిషనర్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించి ఏపీ ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయానికి పంపి అమలు పరుస్తామని హెచ్చరించింది.
తమ ఆదేశాలను ఏపీ ఫైబర్నెట్ యంత్రాంగం మొదట్నుంచి ఉద్దేశపూర్వకంగానే బేఖాతరు చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీశాట్.. ఇకపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. తాము ఏటా రూ.150 కోట్ల నష్టాల్లో ఉన్నామని చెప్తూ జరిమానా చెల్లింపును తప్పించుకునేందుకు ఏపీ ఫైబర్ నెట్ ప్రయత్నం చేసినా దాన్ని తోసిపుచ్చింది. జరిమానాలో ఎలాంటి మినహాయింపు ఉండబోదని టీడీశాట్ స్పష్టం చేసింది. తక్షణం ఛానల్ పునరుద్ధరించకుంటే అప్పటివరకు రోజుకు రూ. రెండు లక్షల చొప్పున జరిమానా పెంపుతో పాటు లోకల్ కమిషనర్ బృందంను పంపుతామని ఆదేశించింది.
ఏపీలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 న్యూస్ చానళ్లపై అనధికార నిషేధం నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఒత్తిడితోనే ఎంఎస్వోలు ప్రసారాలను నిలిపివేశారని ఆరోపణలు వినిపించాయి. దీంతో టీవీ5 ఈ విషయంలో టెలికాం వివాదాలు పరిష్కరించే అప్పిలేట్ ట్రిబ్యునల్(టీడీశాట్)ను ఆశ్రయించింది. ఏపీ ఫైబర్ నెట్లో టీవీ5 ప్రసారాలు ఆపేసినందుకు అక్టోబర్ 1న టీడీశాట్ భారీ జరిమానా విధించింది. ఛానెల్ ప్రసారాలు పునరుద్ధరించే వరకూ రోజుకు రూ. 2 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగానే ప్రసారాలు ఆపేసినట్టు కనిపిస్తున్నదని ఘాటుగానే వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలు అమలు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని అక్టోబర్ 1నే హెచ్చరించింది. అయితే, ఏపీ ఫైబర్నెట్ టీమ్ ఈ ఆదేశాలని పట్టించుకోని నేపథ్యంలో.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారానికి రూ. 32 లక్షలు జమ చేయాల్సిందింగా టీడీశాట్ ఆదేశించింది.