ముంబై: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలతో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మహారాష్ట్రలో అధికార బీజేపీ, మరో ఐదేళ్లూ అధికార పీఠాన్ని దక్కించుకోనుంది. అత్యధిక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే రెండు రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మాదిరిగానే ఇప్పుడు కూడా బీజేపీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత లేదని, తిరిగి తామే అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ముందు నుంచే చెబుతున్నారు. అయితే, హర్యానాలో మాత్రం కాంగ్రెస్, జేజేపీ, ఐఎస్ఎల్డీ కూటమిల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి 160పైగా స్థానాల్లో లీడింగ్ లో ఉంది. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి 88కిపైగా స్థానాల్లో ఇతరులు 28 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మహారాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు 25 వేల మంది సిబ్బందిని ఈసీ నియమించింది. ఎన్నికల ఫలితాలపై బీజేపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 స్ధానాలకు గాను బీజేపీ-శివసేన కూటమికి 197 నుంచి 211 మధ్య స్ధానాలు వస్తాయని దాదాపు 11 ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. రెండోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందనే ధీమాతో విజయోత్సవాలకు సిద్ధం అయ్యారు. ఇక హర్యానాలో మొత్తం 90 స్థానాలుండగా, 50 చోట్ల తొలి రౌండ్ పూర్తయింది. బీజేపీ 26 చోట్ల, కాంగ్రెస్ 14 చోట్ల, ఐఎస్ఎల్డీ కూటమి ఒక్క చోట, జేజేపీ 2 చోట్ల, ఇతరులు 7 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
దేశంలో మరో 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి. యూపీలో 11, గుజరాత్ లో ఆరు, బిహార్ లో ఐదు, అసోంలో నాలుగు, హిమాచల్ లో రెండు, తమిళనాడులో రెండు, పంజాబ్ లో నాలుగు, కేరళలో ఐదు, సిక్కింలో మూడు, రాజస్థాన్ లో రెండు, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, మేఘాలయా, పుదుచ్చేరి, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కో స్థానాల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి. మధ్యాహ్నం వరకు పూర్తి తుది ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.